UPI: రూ. 2 వేలపైగా యూపీఐ లావాదేవీలకు ఇక ఛార్జీలు.! తలకు మించిన భారం పడినట్టే..
డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై పెద్ద వ్యాపారులకు మెర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
UPI: రూ. 2 వేలపైగా యూపీఐ లావాదేవీలకు ఇక ఛార్జీలు.! తలకు మించిన భారం పడినట్టే..
UPI: యూపీఐ లావాదేవీల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు, పెద్ద వ్యాపారుల ద్వారా జరిగే రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎం.డి.ఆర్ రుసుమును తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2020 జనవరిలో ప్రభుత్వం యూపీఐపై ఎం.డి.ఆర్ రుసుమును పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగినప్పటికీ, లావాదేవీల నిర్వహణ వ్యయం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లపై ఆర్థిక భారాన్ని మోపుతోంది.
ప్రతిపాదిత ఎం.డి.ఆర్ విధానం కేవలం వార్షిక టర్నోవర్ రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్లు దాటిన పెద్ద వ్యాపారులకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది. దాదాపు 90 శాతం చిన్న వ్యాపారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుందని అంచనా. ఈ రుసుమును సుమారు 0.5 శాతం లేదా 5-7 బేసిస్ పాయింట్ల వరకు నిర్ణయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కాగా, ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం రాబోయే నెలలో వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిలకడగా కొనసాగేందుకు ఈ చర్య అవసరమని పరిశ్రమ వర్గాలు వాదిస్తుండగా, ప్రభుత్వం అన్ని అంశాలను చర్చించి త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.




