RBI: ఆగస్టు 5న ఆర్బీఐ ఏం ప్రకటించనుంది.? లోన్ తీసుకున్న వారికి ఊరట లభించనుందా
RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఆగస్టు 3 నుంచి 5 వరకు జరగనుంది.
RBI: ఆగస్టు 5న ఆర్బీఐ ఏం ప్రకటించనుంది.? లోన్ తీసుకున్న వారికి ఊరట లభించనుందా
RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఆగస్టు 3 నుంచి 5 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటుతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెపో రేటులో మార్పు ఎందుకు ఉండకపోవచ్చు?
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితిపై ఉన్న అనిశ్చితి వంటి అంశాలు ఆర్బీఐ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే వడ్డీ రేట్లలో మార్పు చేయకుండా, పరిస్థితులను గమనిస్తూ ముందుకు వెళ్లే 'వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని ఆర్బీఐ అనుసరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణంపైనే ఆర్బీఐ ప్రధాన దృష్టి
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పలుమార్లు ద్రవ్యోల్బణ నియంత్రణే ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రుతుపవనాల ప్రభావం ఆహార ధరలపై నేరుగా పడుతుందని, అందుకే వర్షపాత పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే కూరగాయలు, ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది.
ఇప్పటికే రెపో రేటును పలుమార్లు తగ్గించిన ఆర్బీఐ
గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ మొత్తం 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించింది. దీని వల్ల బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు తగ్గి, ప్రజలు తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం లభించింది. ఇప్పుడు ఇప్పటికే తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉందో పరిశీలించిన తర్వాతే మరోసారి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందా?
ఈసారి రెపో రేటులో మార్పు ఉండకపోయినా, భవిష్యత్తులో పరిస్థితులు మారితే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూ ఉంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు రెపో రేటు పెంపుపై ఆర్బీఐ ఆలోచించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయం పూర్తిగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, దేశీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
జీడీపీ అంచనాలు, బ్యాంకింగ్ లిక్విడిటీపై కూడా దృష్టి
ఈ సమావేశంలో ఆర్బీఐ దేశ ఆర్థిక వృద్ధి (GDP), ద్రవ్యోల్బణానికి సంబంధించిన తాజా అంచనాలను కూడా సమీక్షించనుంది. దేశీయ వినియోగం బలంగా కొనసాగితే జీడీపీ అంచనాల్లో స్వల్ప మార్పు ఉండొచ్చని కొందరు భావిస్తుండగా, ప్రపంచ ఆర్థిక మందగమనం, ఇంధన దిగుమతుల వ్యయం, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) విషయంలో కూడా ఈ సమావేశంలో పెద్ద ప్రకటన వచ్చే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే రెపో ఆక్షన్లు లేదా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా మార్కెట్లో నగదు సమతుల్యతను కొనసాగించే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.




