Patanjali: బాబా రాందేవ్ సంచలన నిర్ణయం.. 'పతంజలి'ని మరో రంగంలోకి మళ్లింపు
Patanjali: ఆయుర్వేద, ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి రూ. 4,500 కోట్ల అంచనాతో మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేస్తూ బీమా రంగంలోకి అడుగుపెట్టింది.
Patanjali: బాబా రాందేవ్ సంచలన నిర్ణయం.. 'పతంజలి'ని మరో రంగంలోకి మళ్లింపు
Baba Ramdev: పోటీ ప్రపంచంలో వ్యాపారాన్ని విస్తరించడం ఒక ఎత్తైతే... కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించడం మరో ఎత్తు. ఆయుర్వేద ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న పతంజలి ఆయుర్వేద్ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతోంది. దేశీయ బీమా రంగంలోకి భారీ ప్రణాళికలతో అడుగుపెడుతోంది. బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన IRDAIనుండి పతంజలికి కీలకమైన ఆమోదం లభించడంతో ఈ మెగా డీల్కి మార్గం సుగమమైంది.
సుమారు రూ. 4,500 కోట్ల భారీ అంచనాతో జరుగుతున్న ఈ కొనుగోలు వ్యవహారంలో పతంజలి ఒంటరిగా లేదు. డీఎస్ గ్రూప్తో కలిసి ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. పతంజలి వాటా 73.56%,డీఎస్ గ్రూప్ వాటా 24.5% నిర్ణయించబడింది. ప్రస్తుత వాటాదారుల నుంచి దాదాపు 98% వాటాను ఈ రెండు సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. ఈ కొనుగోలు ప్రక్రియను రాబోయే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని IRDAI స్పష్టం చేసింది.
క్రొత్తగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, మొదటి నుంచి వ్యాపారాన్ని నిర్మించడం కంటే... ఇప్పటికే మార్కెట్లో బలంగా ఉన్న సంస్థను కొనుగోలు చేయడమే పతంజలి వేసిన మాస్టర్ ప్లాన్.ఇప్పటివరకు పతంజలి అనగానే మనకు నిత్యవసర వస్తువులు, ఆయుర్వేద మందులే గుర్తుకొచ్చేవి. కానీ, ఈ డీల్తో పతంజలి చరిత్రలోనే తొలిసారిగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెడుతోంది.
భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో పతంజలికి ఉన్న పంపిణీ వ్యవస్థ ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ నెట్వర్క్ను బీమా ఉత్పత్తులను మూలమూలలకూ తీసుకెళ్లడానికి ఉపయోగించబోతున్నారు.
పట్టణాలకే పరిమితమైన ఇన్సూరెన్స్ను పల్లెపల్లెకూ చేర్చడంలో ఈ కలయిక ఒక గేమ్ చేంజర్ కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయుర్వేదం నుంచి... ఆర్థిక భద్రతనిచ్చే ఆస్తి, ఆరోగ్య బీమా దాకా పతంజలి వేస్తున్న ఈ కొత్త అడుగు రాబోయే రోజుల్లో భారత ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.




