India-Australia CECA Trade Deal: భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తి చేయాలి: మోదీ
భారత్-ఆస్ట్రేలియా సీఈసీఏ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోదీ కోరారు. ఆస్ట్రేలియా కంపెనీలను భారత్లో పెట్టుబడులకు ఆహ్వానించారు.
India-Australia CECA Trade Deal
భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంను వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొత్త స్థాయికి చేరుకుంటాయని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓల ఫోరం మరియు ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ ఈవెంట్లో పాల్గొన్న మోదీ, భారత్లో పెట్టుబడులకు ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు.
భారత్లో అపార అవకాశాలు
విమానయాన, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో భారత్లో అపార పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. బలమైన ఆర్థిక వృద్ధి, సంస్కరణలు, డిజిటల్ పరివర్తన, స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ విదేశీ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయని వివరించారు.
ఆస్ట్రేలియన్ సూపర్ నుంచి భారీ పెట్టుబడి
ఈ సందర్భంగా AustralianSuper సంస్థ భారత్లో 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడాన్ని మోదీ స్వాగతించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ప్రస్తుతం AustralianSuper సంస్థ 3.6 మిలియన్లకు పైగా సభ్యుల రిటైర్మెంట్ నిధులను నిర్వహిస్తూ 410 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది.
ECTA తర్వాత మరో కీలక అడుగు
2022లో ఇరు దేశాలు ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ECTA)పై సంతకం చేసిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని మోదీ గుర్తుచేశారు. ఇప్పుడు CECA ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మూడురోజుల ఆస్ట్రేలియా పర్యటన
ప్రధాని మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్తో సమావేశం కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.




