L&T AI Factory: ఏఐ ప్రపంచంలో భారత్ సంచలనం..రూ.15,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ!
L&T AI Factory: లార్సెన్ అండ్ టూబ్రో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద ఏఐ ప్రాజెక్ట్ను దక్కించుకుంది.
L&T AI Factory: ఏఐ ప్రపంచంలో భారత్ సంచలనం..రూ.15,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ!
L&T AI Factory: దేశీయ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ భారత్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సరికొత్త ఎత్తులకు చేర్చే దిశగా అడుగులు వేసింది. సాంకేతిక ప్రపంచం విస్తుపోయేలా.. ఏకంగా రూ. 10,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన భారీ మెగా ప్రాజెక్ట్ను సొంతం చేసుకుని టెక్ రంగంలో సంచలనం సృష్టించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ క్లౌడ్ ప్లాట్ఫారమ్ టుగెదర్ ఏఐ భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద సింగిల్-క్లస్టర్ ఏఐ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎల్అండ్టీ శ్రీకారం చుట్టింది.
ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ చెన్నైలోని ఎల్అండ్టీ డేటా సెంటర్ క్యాంపస్లో రూపుదిద్దుకోనుంది. ఎల్అండ్టీకి చెందిన డిజిటల్ విభాగం వియోమా ఏఐ , దాని అనుబంధ సంస్థ LTN కంప్యూట్ ఈ భారీ బాధ్యతను భుజాన వేసుకున్నాయి.
ఏఐ ప్రాసెసింగ్లో అత్యంత శక్తివంతమైన 10,000 NVIDIA B300 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ ఫ్యాక్టరీలో అమర్చనున్నారు. భవిష్యత్తులో గిగావాట్ స్థాయికి విస్తరించే సామర్థ్యంతో డిజైన్ చేసిన ఈ ఫ్యాక్టరీ, తొలిదశలో 250 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది.
ప్రపంచస్థాయి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ శిక్షణ ,ఇన్ఫరెన్స్ ప్రాసెసింగ్ పనులు ఇక్కడ కంటిరెప్పపాటులో జరిగిపోతాయి. ఇప్పటివరకు ఐటీ సేవలందించడంలో ప్రపంచానికే నాయకత్వం వహించిన భారత్, ఇప్పుడు సొంతంగా అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించే స్థాయికి ఎదిగింది.
ఈ భారీ ఏఐ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే.. మనదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను అత్యంత వేగంగా డెవలప్ చేసే వెసులుబాటు కలుగుతుంది. విదేశీ టెక్ దిగ్గజాలు తమ ఏఐ డేటా ప్రాసెసింగ్ కోసం భారతదేశం వైపు చూసేలా చేస్తుంది.
టెక్నాలజీ, డేటా సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో వేలాది అత్యున్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చెన్నై వేదికగా ప్రారంభం కాబోతున్న ఈ ఏఐ ఫ్యాక్టరీ ప్రపంచ ఏఐ పటంలో భారతదేశ ముద్రను చెరగని విధంగా లిఖించబోతోంది.




