EPS: ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7,500 కానుందా.? పార్లమెంట్లో కేంద్రం కీలక సమాధానం
EPS: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం ఉన్న రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
EPS: ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7,500 కానుందా.? పార్లమెంట్లో కేంద్రం కీలక సమాధానం
EPS: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం ఉన్న రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్సభలో స్పష్టం చేసింది.
పార్లమెంట్లో రూ.7,500 పెన్షన్ అంశం
లోక్సభలో ఎంపీ భౌసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఈ అంశాన్ని ప్రస్తావించారు. EPS-95 నేషనల్ అజిటేషన్ కమిటీ చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ మేరకు కనీస పెన్షన్ను రూ.7,500కు పెంచడంతో పాటు డియర్నెస్ అలవెన్స్ (DA) కూడా ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదా అని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ప్రస్తుతం కనీస పెన్షన్ను రూ.1,000 నుంచి పెంచే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్లో దీనిపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనే విషయంపై కూడా ఎలాంటి గడువు వెల్లడించలేదు.
ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటే?
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, పెన్షన్ ఫండ్ ఆర్థిక పరిస్థితి కూడా అంతే ముఖ్యమని పేర్కొంది. కనీస పెన్షన్ను పెంచే ముందు పెన్షన్ ఫండ్ ఆర్థిక బలం, భవిష్యత్లో చెల్లించాల్సిన పెన్షన్ బాధ్యతలు, దీర్ఘకాలికంగా ఫండ్ నిలకడగా కొనసాగడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణాల వల్ల ప్రస్తుతం కనీస పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం వివరించింది.
EPS పెన్షన్ ఫండ్కు డబ్బు ఎలా వస్తుంది?
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం EPS ఫండ్ ఎలా నిర్వహిస్తుందో కూడా వివరించింది. పెన్షన్ ఫండ్కు ప్రధానంగా రెండు మార్గాల ద్వారా నిధులు వస్తాయి. యజమాని (Employer) ఉద్యోగి వేతనంలో 8.33 శాతం మొత్తాన్ని పెన్షన్ ఫండ్కు జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు వేతనం పొందే ఉద్యోగుల కోసం 1.16 శాతం బడ్జెట్ నుంచి అందిస్తుంది. ఈ నిధుల ద్వారానే పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు చెల్లిస్తారు. ఫండ్ ఆర్థిక స్థితిని ప్రతి సంవత్సరం సమీక్షించి, భవిష్యత్ అవసరాలకు సరిపడేలా చూసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
రూ.1,000 పెన్షన్ సరిపోతుందా?
ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు రూ.1,000 లేదా రూ.2,000 పెన్షన్తో వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడపడం సాధ్యమా అని ఎంపీ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, EPS-1995 కింద కనీసం రూ.1,000 నెలవారీ పెన్షన్ అందేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఇది EPFOకు ప్రభుత్వం చేసే సాధారణ వాటాకు అదనంగా ఇస్తున్న సాయమని వివరించింది.
EPS-2026లో కొత్త మార్పులు ఏవి?
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈపీఎస్ (EPS)-2026ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది పాత EPS-1995 స్థానాన్ని భర్తీ చేసింది. కొత్త పథకంలో భాగంగా పెన్షన్ క్లెయిమ్లను 20 రోజుల్లో పరిష్కరించే నిబంధన, నిర్ణీత గడువులో క్లెయిమ్ పరిష్కారం కాకపోతే 12 శాతం వడ్డీ చెల్లించే నిబంధన, హయ్యర్ పెన్షన్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు,
యజమానుల కోసం డిజిటల్ కంప్లయన్స్ విధానం వంటివి ఉన్నాయి. అయితే, పెన్షన్ లెక్కించే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఉద్యోగి పెన్షన్కు అర్హమైన వేతనం, పెన్షన్కు అర్హమైన సేవా కాలం ఆధారంగానే నెలవారీ పెన్షన్ను నిర్ణయిస్తారు.




