Investment Plans: సీనియర్ సిటిజన్ల దగ్గర రూ. 5 లక్షలు ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నిపుణుల సూచనలు!
సీనియర్ సిటిజన్లు తమ వద్ద ఉన్న మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉంటుంది, ఎటువంటి స్కీమ్ల ద్వారా మంచి వడ్డీ పొందవచ్చనే అంశాలపై ప్రముఖ ఆర్థిక నిపుణులు విలువైన సలహాలు ఇస్తున్నారు.
Investment Plans: సీనియర్ సిటిజన్ల దగ్గర రూ. 5 లక్షలు ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నిపుణుల సూచనలు!
Investment Plans: వృద్ధాప్యంలో ఉన్నవారికి ప్రధానంగా ఆర్థిక భద్రత అనేది ఎంతో అవసరం. సీనియర్ సిటిజన్ల వద్ద ఉండే ఐదు లక్షల రూపాయలు లేదా ఇతర సేవింగ్స్ పూర్తిగా సురక్షితంగా ఉండాలంటే, ఈక్విటీ మార్కెట్ల జోలికి వెళ్లకుండా క్యాపిటల్ గ్యారెంటీ లభించే పథకాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు నిండిన వారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఈ పథకంలో సుమారు 8.2 శాతం వరకు వడ్డీ లభిస్తుండగా, ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రూపంలో ఆదాయం అందుకోవడానికి అవకాశం ఉంది.
అలాగే పోస్టల్ డిపాజిట్ స్కీమ్లు కూడా సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన మార్గమని ఆయన తెలిపారు. దీనితో పాటు సాధారణ బ్యాంకులతో పోలిస్తే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని(సుమారు 8.5 శాతం వరకు) అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది కాబట్టి, కుటుంబ సభ్యుల పేర్లతో విడదీసి పెట్టుకోవడం సురక్షితం. ఒకవేళ ఈ డబ్బు అత్యవసరం కాకపోతే, కొద్దిపాటి రిస్క్తో కూడిన కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపడం ద్వారా కాస్త ఎక్కువ రిటర్న్స్ సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ కోసం ముందస్తుగా భారీ నిధిని సమకూర్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవించే ప్రాంతాన్ని బట్టి కోటి రూపాయల వరకు కార్పస్ ప్లాన్ చేసుకోవడం అవసరమని సూచించారు. రిస్క్ వద్దు అనుకునే వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలు, పోస్టల్ డిపాజిట్లను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలని స్పష్టం చేశారు.




