Hyundai: మార్కెట్ను ఊపేయడానికి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే 5 కొత్త పవర్ఫుల్ SUVs
Hyundai: కార్ లవర్స్కు హ్యుందాయ్ కంపెనీ అదిరిపోయే శుభవార్త అందించింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ఏకంగా 5 కొత్త ఎస్యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
Hyundai Palisade
Hyundai:భారత ఆటో మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు హ్యుందాయ్ ఇండియా భారీ వ్యూహాన్ని రచించింది. 2030 నాటికి సుమారు 26 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లలో విభిన్న మోడళ్లను అందించబోతోంది. వీటిలో దాదాపు 7 నుంచి 8 పూర్తిగా కొత్త ఎస్యూవీలు ఉండగా, మిగిలినవి ఫేస్లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్లుగా రానున్నాయి. వీటిలో ప్రధానంగా మార్కెట్ను శాసించబోయే టాప్ 5 ఎస్యూవీల వివరాలు ఇవే.
బేయాన్ ఆధారిత కొత్త ఎస్యూవీ, క్యూట్ ఈవీ
సబ్-4-మీటర్ సెగ్మెంట్లో హ్యుందాయ్ బేయాన్ మోడల్ ఆధారంగా కొత్త కార్ను తీసుకొస్తోంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో రానున్న ఈ కారు, కంపెనీ నుంచి సీఎన్జీతో వస్తున్న తొలి 4-మీటర్ల ఎస్యూవీ కానుంది. దీనికితోడు టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా సిద్ధం చేస్తోంది. ఇన్స్టర్ ఈవీ నుంచి పవర్ట్రెయిన్ తీసుకుని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి దించనుంది.
7-సీటర్ మోడల్, ఆల్ న్యూ క్రెటా హైబ్రిడ్
కుటుంబ సమేతంగా ప్రయాణించే వారి కోసం నికోడ్ నేమ్ Ni1i పేరుతో ఒక కొత్త 7-సీటర్ ఎస్యూవీ రూపుదిద్దుకుంటోంది. చైనాలో అమ్ముడవుతున్న టక్సన్ లాంగ్ వీల్బేస్ ఆధారంగా ఇది రూపొందే అవకాశం ఉంది. ఇక భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా కారులో థర్డ్ జెనరేషన్ మోడల్ను పరిచయం చేయనున్నారు. ఈ కొత్త క్రెటాలో మైలేజ్ అదరగొట్టేలా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను అందించబోతున్నారు.
2028లో అడుగుపెట్టనున్న భారీ ప్యాలీసేడ్
హ్యుందాయ్ తన గ్లోబల్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ప్యాలీసేడ్ను 2028 నాటికి భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లగ్జరీ ఎస్యూవీలో 2.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగిన నెక్స్ట్ జెనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించనున్నారు. ప్రీమియం సౌకర్యాలతో రానున్న ఈ పెద్ద కారు భారత లగ్జరీ సెగ్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.
పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వరకు అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా హ్యుందాయ్ తెస్తున్న ఈ కొత్త ఎస్యూవీలు మార్కెట్లో సంచలనం సృష్టించనున్నాయి. రాబోయే రోజుల్లో మిగతా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు ఇవి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.




