E85 Fuel : వాహనదారులకు శుభవార్త.. నేటి నుంచే E85 ఇంధనం అందుబాటులోకి.!
E85 Fuel : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశం ఇంధన రంగంలో ఒక కీలక అడుగు వేసింది. దేశంలో ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడమే..
e85 fuel
E85 Fuel : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశం ఇంధన రంగంలో ఒక కీలక అడుగు వేసింది. దేశంలో ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా, కేంద్ర పెట్రోలియం , సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఢిల్లీలోని పూసా రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద సరికొత్త ‘ఈ85’ (E85) ఇంధనాన్ని ప్రారంభించారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల (Flex-fuel vehicles) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సరికొత్త ఇంధనాన్ని దేశంలోని ప్రధాన నగరాల్లో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏమిటీ ఈ85 ఇంధనం?
ఈ85 అనేది 85 శాతం ఇథనాల్ , 15 శాతం పెట్రోల్ కలిపిన ఒక ప్రత్యేక మిశ్రమం. మన దేశంలో పండే పంటల (ముఖ్యంగా చెరకు, ధాన్యాల) వ్యర్థాల నుండి దేశీయంగానే ఈ ఇథనాల్ను తయారు చేస్తారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుంది.
వినియోగదారులకు భారీగా తగ్గనున్న ఖర్చు
ఈ కొత్త ఇంధనం వల్ల వాహనదారులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం కలగనుంది. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఈ85 ఇంధనం ధర చాలా తక్కువగా ఉండబోతోంది. వినియోగదారులకు తక్కువ ధరకే ఇంధనం లభించడమే దీని ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. సాధారణ పెట్రోల్ , ఈ20 పెట్రోల్ కంటే ఈ85 ధర తక్కువగా ఉండటం వల్ల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు వాడుకునే వారికి ఇంధన ఖర్చులు భారీగా కలిసివస్తాయి.
దేశవ్యాప్తంగా లభ్యత
తొలి దశలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణే , నాగ్పూర్ వంటి నగరాల్లో సుమారు 50 పెట్రోల్ బంకుల్లో ఈ ఇంధనం అందుబాటులోకి వస్తుంది. దీనిని డిసెంబర్ 2026 నాటికి 500 బంకులకు, వచ్చే ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో సుమారు 5,000 బంకులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఇంధన లాంచ్కు ముందే మారుతి సుజుకి సంస్థకు చెందిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ఆర్ (WagonR) కారును, హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ బైకుల ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను మంత్రి మార్కెట్లోకి విడుదల చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం
ప్రస్తుతం భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 89 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది.
భారతదేశం ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను 2014 నాటి 1.5% నుండి 20 శాతానికి పెంచింది. దీనివల్ల 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతి తగ్గి, ఏకంగా రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) ఆదా అయింది. భవిష్యత్తులో కొత్తగా వచ్చే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో 50 శాతం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలే ఉంటే, దేశంలో ఇథనాల్ డిమాండ్ మరో 400 కోట్ల లీటర్లు పెరుగుతుందని, తద్వారా దేశీయ రైతులకు , ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.




