Amalapuram: అమలాపురంలో వైకాపా నిరసన ఆక్వా రంగం సంక్షోభంలో ఉందన్న జగ్గిరెడ్డి
Amalapuram: ఆక్వా ఫీడ్ ధరల పెంపు, ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ అమలాపురంలో వైకాపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
Amalapuram: అమలాపురంలో వైకాపా నిరసన ఆక్వా రంగం సంక్షోభంలో ఉందన్న జగ్గిరెడ్డి
అమలాపురం: డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం లో ఆక్వా రైతుల సమస్యలు మరియు ధాన్యం కొనుగోలు పై రైతులు పడుతున్న ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా యూనిట్కు రూ.1.50 పైసలకే విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. అలాగే మేత (ఫీడ్) ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవడంతో టన్నుకు సుమారు రూ.10 వేల వరకు అదనపు భారం పడుతోందని చెప్పారు.
అదేవిధంగా సిండికేట్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి రొయ్యల ధరలు తగ్గడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయని జగ్గిరెడ్డి ఆన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు అండగా ఉన్న ఏపీఎస్డిఏ (APSDA) వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.ఆందోళన అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించి ఆక్వా రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కో- ఆర్డినేటర్లు,ఎమ్మెల్సీలు, PAC సభ్యులు, CEC మెంబర్లు, SEC మెంబర్లు,రాష్ట్ర కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




