Weather Update : వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రెండు రాష్ట్రాల్లో నేడు వాతావరణం ఎలా ఉందంటే ?
Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తీవ్రమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రోజున ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన జిల్లాల్లో కూడా మేఘావృతమై చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపారు. వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తెలంగాణలో మధ్యాహ్నం తర్వాత వాన జోరు
ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజంతా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్లో సాయంత్రం వర్షం పడే ఛాన్స్
రాజధాని నగరం హైదరాబాద్లో కూడా రోజంతా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




