Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హై అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
Weather Update
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా రాబోయే కొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా పయనిస్తోంది. పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు మరొక రుతుపవన ద్రోణి విస్తరించి ఉండటంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం తీవ్రంగా అలజడిగా మారినందున సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో చల్లబడిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో గాలిలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చల్లటిగాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు పడిపోగా, రాత్రి వేళల్లో 22 డిగ్రీల నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
వర్షాలు పడే సమయంలో బలమైన గాలులు వీచే వీలున్నందున చెట్లు, పాత భవనాల కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే వేళ విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు, రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో ఉరుములు వస్తే తక్షణమే సురక్షితమైన నీడకు చేరుకోవాలని హెచ్చరించారు.




