Private Bus Burnt : రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. దేవుడిలా మారిన డ్రైవర్..
Private Bus Burnt : అనకాపల్లి జిల్లాలో భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో 35 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Private Bus Burnt
Private Bus Burnt : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం తప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచితమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ లగ్జరీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు రోడ్డుపై వేగంగా వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి, వాహనాన్ని పూర్తిగా దహించివేశాయి. అయితే ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విందు భోజనం ముగిశాక మొదలైన అసలు కథ
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ లో బయల్దేరిన ఈ ప్రైవేట్ బస్సు మార్గమధ్యలో రాత్రి సమయంలో ఒక హోటల్ దగ్గర డిన్నర్ కోసం ఆగింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ భోజనాలు ముగించుకున్న తర్వాత బస్సు మళ్లీ విశాఖపట్నం మీదుగా చెన్నై వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయాణికులంతా తిన్న తర్వాత బస్సులో గాఢ నిద్రలోకి జారుకున్నారు. అయితే బస్సు సరిగ్గా అనకాపల్లి జిల్లా పరిధిలోకి రాగానే ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది.
అప్రమత్తం చేసిన సేఫ్టీ అలారం.. డ్రైవర్ సాహసం
బస్సు రన్నింగ్ లో ఉండగానే ముందు భాగంలో ఎడమ వైపు ఉన్న ఇంజన్ ఏరియా నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలైంది. వెంటనే బస్సులో ఉన్న ఆటోమేటిక్ సేఫ్టీ అలారం గట్టిగా మోగింది. ఆ శబ్దానికి డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన ఏమాత్రం కంగారు పడకుండా చకచకా వ్యవహరించాడు. బస్సును వెంటనే హైవే పక్కన ఆపి, సీట్లలో నిద్రపోతున్న ప్రయాణికులందరినీ కేకలు వేస్తూ త్వరత్వరగా కిందకు దించేశాడు.
కళ్లెదుటే కాలి బూడిదైన లగ్జరీ బస్సు
ప్రయాణికులంతా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బస్సులోంచి కిందకు దిగిన కొద్ది నిమిషాలకే మంటలు తీవ్రరూపం దాల్చాయి. డ్రైవర్ క్యాబిన్ నుంచి మొదలైన మంటలు బస్సు సీట్లు, విండోలకు అంటుకుని చూస్తూ చూస్తుండగానే వాహనం మొత్తాన్ని కమ్మేసాయి. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీసులకు, ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు అస్థిపంజరంలా మారిపోయింది.
షార్ట్ సర్క్యూటే కారణం.. సీఐ నుంజయ్ వెల్లడి
ఈ ఘోర ప్రమాదంపై అనకాపల్లి రూరల్ సీఐ నుంజయ్ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. బస్సులోని 35 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని ఆయన స్పష్టం చేశారు. బస్సు డ్రైవర్ సరైన సమయంలో స్పందించి ప్రయాణికులను దించేయడం వల్లే ఈ పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండేదని డ్రైవర్ ను అభినందించారు. బస్సు ఇంజన్ లో జరిగిన వైరింగ్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితులందరికీ చెన్నై వెళ్లేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.




