ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం... గ్రీవెన్స్లో మంత్రి నారాయణ
Narayana: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో మంత్రి నారాయణ పాల్గొని 56 మంది బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం... గ్రీవెన్స్లో మంత్రి నారాయణ
Narayana: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాదంలో బాధితులైన కార్మికులకు వైద్య సహాయం అందించడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో జరగాల్సిన కూటమి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు మంత్రివర్గ సభ్యులంతా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. అయితే ఈ విషాద ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం, శవ రాజకీయాలకు పాల్పడటం సరైన విధానం కాదని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలను విశ్వసించరని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు.
గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 56 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను వినిపించినట్లు మంత్రి తెలిపారు. అందులో 60 శాతానికి పైగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులేనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలు, భూ రికార్డుల సమస్యలు, పరిపాలనా లోపాల కారణంగా ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీ కూడా పనిచేస్తోందని వెల్లడించారు. గ్రీవెన్స్లో అందిన ఫిర్యాదులను సంబంధిత జిల్లా కలెక్టర్లు, శాఖల అధికారులకు వెంటనే పంపించినట్లు తెలిపారు.
పెన్షన్లు, మున్సిపల్ సేవలు, కుటుంబ వివాదాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు చేశారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.




