Thalli Bidda Express: గుంటూరు జీజీహెచ్లో 'తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్' ప్రారంభం: మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!
Thalli Bidda Express: గుంటూరు జీజీహెచ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే నసీర్. 102 ఉచిత వాహనాలు, 700 పడకల మాతా శిశు కేంద్రం విశేషాలు.
Thalli Bidda Express: గుంటూరు జీజీహెచ్లో 'తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్' ప్రారంభం: మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!
Thalli Bidda Express: మాతా శిశు మరణాలను అరికట్టడంతో పాటు పేద ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, మౌలిక వసతులను అందుబాటులోకి తెస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్తో కలిసి ఆయన కొత్త 'తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్' (102) వాహనాలను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసవానికి ముందు, తర్వాత ఏ తల్లీ, బిడ్డా ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో అధునాతన వాహనాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గర్భిణులు, బాలింతలు '102' ఉచిత నంబర్కు ఫోన్ చేస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం నేరుగా వచ్చి ఆసుపత్రికి చేర్చి ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. గర్భవతి, శిశు మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఇక్కడ 18 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్లో స్థానిక పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని 700 పడకలతో అత్యాధునిక మాతా శిశు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.




