Amalapuram: అమలాపురంలో రెండు నూతన కోర్టుల ప్రారంభం
Amalapuram: నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా స్పెషల్ కోర్టు, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రారంభించారు.
Amalapuram: అమలాపురంలో రెండు నూతన కోర్టుల ప్రారంభం
అమలాపురం: జ్యుడీషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయం తో వ్యవహరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన అత్నాలవ వాదనపు జిల్లా స్పెషల్ కోర్టు, రెండవ అదనపు సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ (జూనియర్ డివిజన్) కోర్టులను ఆయన ప్రారంభించారు.
14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరియు రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూని యర్ డివిజన్) ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.న్యాయ వ్యవస్థ బార్ అసోసియేషన్ సమన్వయంతో ఒక మదర్ శాఖలా వ్యవహరిస్తూ ఇందులో ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహించి వ్యవస్థను ముందుకు నడిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు.
మరో గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందనరావు ప్రసంగిస్తూ.., మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ సమకాలీన పోకడలను అనుకరిస్తూ న్యాయవ్యవస్థలో సాంకేతికతను జోడించి, వేగవంతమైన తీర్పులు ఇచ్చే దిశగా అడుగులు వేయాలన్నారు. జస్టిస్ బి.వి.ఎల్. ఎన్. చక్రవర్తి మాట్లాడుతూ.., డిజిటల్ వ్యవస్థల వినియోగం నేటి కాలంలో అత్యవసరమని, కాలంతో పాటు పరిగెత్తినప్పుడే న్యాయ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరుగుతుందని పేర్కొన్నారు. జస్టిస్ న్యాయపతి విజయ్ జిల్లా కోర్టులకు వస్తున్న వివిధ రకాల కేసుల సరళిని వివరిస్తూ.. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్పులు ఉండాలని సూచించారు.
జస్టిస్ సుమతి జగడం మాట్లాడుతూ.. కక్షిదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, న్యాయవాదులు సమన్వయంతో కృషి చేసి వారికి సత్వర ఉపశమనం కలిగించాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేసుల నమోదు పరిష్కార స్థితిగతులపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత సమగ్ర నివేదికను సభకు వివరించారు. కొత్తగా ప్రారంభమైన కోర్టులు కేసుల భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం ప్రకటించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ శేషారావు మాట్లాడుతూ, స్థానికంగా రెండు కొత్త కోర్టుల ప్రారంభం చారిత్రాత్మకమని, ఈ కోర్టులు కక్షిదారులకు మరియు న్యాయవాదులకు ఎంతో ప్రయోజనకరమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి, 14వ అదనపు జడ్జి జి ప్రియదర్శిని, రెండోవ అదనపు జడ్జ్ చంద్రమౌలేశ్వరి, జూనియర్ సివిల్ జడ్జి యస్ శ్రీ రేఖ, పలువురు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లా సురేష్, సీనియర్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.




