Ashwini Vaishnaw: 70 నిమిషాల్లో హైదరాబాద్ టు అమరావతి.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన!

Ashwini Vaishnaw: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్, జూన్ 1న విశాఖ రైల్వే జోన్ ప్రారంభం వంటి కీలక ప్రకటనలు చేశారు.

Arun Chilukuri
Published on: 28 April 2026 12:33 PM IST
Ashwini Vaishnaw
X

Ashwini Vaishnaw: 70 నిమిషాల్లో హైదరాబాద్ టు అమరావతి.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన!

Ashwini Vaishnaw: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు దేశం గర్వించదగ్గ 'విజనరీ లీడర్' అని కొనియాడారు. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

ఒకప్పుడు చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ విప్లవానికి ఎలా నాంది పలికాయో, ఇప్పుడు విశాఖపట్నం అదే తరహాలో 'ఐటీపట్నం'గా మారబోతోందని అశ్వినీ వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. యువ మంత్రి నారా లోకేశ్ నాయకత్వాన్ని, సమస్యల పరిష్కారంలో ఆయనకున్న స్పష్టతను కూడా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్స్ విశాఖకు రావడం ఏపీ టెక్నాలజీ భవిష్యత్తును మార్చేస్తుందని అన్నారు.

ఏపీకి రైల్వే నిధుల వెల్లువ.. జూన్ 1న రైల్వే జోన్!

డబుల్ ఇంజిన్ సర్కార్ పుణ్యమా అని ఏపీకి రైల్వే నిధులు భారీగా పెరిగాయని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం రూ.800 కోట్లుగా ఉన్న రైల్వే నిధులు, ఇప్పుడు ఒక్క ఏపీకే రూ.10,000 కోట్లకు పైగా అందుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1న ప్రారంభం కానుంది. ఏపీలో రైల్వే నెట్‌వర్క్ వంద శాతం విద్యుదీకరణ పూర్తయిందని ఆయన ప్రకటించారు.

70 నిమిషాల్లో హైదరాబాద్ టు అమరావతి!

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుగా అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ రాబోతోందని మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కేవలం 70 నిమిషాల్లోనే రెండు నగరాల మధ్య ప్రయాణించవచ్చని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story