Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడ్రోజులు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులు

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

CR Reddy
Published on: 8 Sept 2026 7:22 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ద్రోణి నేడు కూడా స్థిరంగా కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ నిపుణులు వెల్లడించారు.

ఏపీలో ఈదురుగాలులు, ఉరుముల భయం

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో రాబోయే మూడ్రోజులు జల్లులు పడనున్నాయి. కొన్నిచోట్ల బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే వీలుంది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు, పొలాల్లో పనిచేసే రైతులు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో పండుగ నాటికి పెరగనున్న వానల తీవ్రత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రాబోయే మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 12 నుంచి రాష్ట్రంలో ఉరుములతో కూడిన వానలు ప్రారంభమై, 13 నుంచి 17వ తేదీ వరకు పలు జిల్లాల్లో దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వినాయక చవితి పండుగ సమయానికి వానల తీవ్రత మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నందున పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ప్రజలు పాటించాల్సిన అత్యవసర జాగ్రత్తలు

వర్షాలు, ఉరుములు ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం మంచిది. ఆకస్మికంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లోని చెట్ల కింద నిలబడకూడదు. భారీ ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, పెద్దపెద్ద ప్రకటనల హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటి నీడన వేచి చూడకూడదని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story