Weather Update : ఒకవైపు నిప్పుల కొలిమి, మరోవైపు పిడుగుల వాన.. ఏపీ, తెలంగాణలో వింత వాతావరణం

Weather Update : ఏపీ, తెలంగాణలో వింత వాతావరణం నెలకొంది. 44 డిగ్రీల ఎండలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏ జిల్లాల్లో ఎండలు మండుతాయి? ఎక్కడ వర్షాలు పడతాయో చూద్దాం.

CR Reddy
Published on: 30 April 2026 6:57 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు కూడా ఇదే వింత వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో నిప్పుల కొలిమి

ఏపీలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో ఏకంగా 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 88 మండలాల్లో ఎండలు 41 డిగ్రీలు దాటాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు రాకూడదని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు

ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. విజయనగరం, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున, వర్షం పడే సమయంలో రైతులు, పశుకాపరులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో 5 జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే కొద్ది గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల గాలిలో ఏర్పడిన మార్పుల కారణంగా అకస్మాత్తుగా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. సాయంత్రం వేళకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై వర్షం పడే వీలుంది.

పశ్చిమ ప్రాంతంలో జల్లులు

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా చోట్ల పొడి వాతావరణం, తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. అయితే నగర పశ్చిమ ప్రాంతంలో (గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఏరియాల్లో) సాయంత్రం వేళ వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉక్కపోత నుంచి ఈ జల్లులు కాస్త ఉపశమనం కలిగించినా, ఆకస్మిక వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణికులు గొడుగు వెంట ఉంచుకోవడం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే పిడుగుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story