AP News: సొంత ఇల్లు లేని పేదలకు శుభవార్త.. 4 లక్షల ఇళ్లు మంజూరు.!
AP News: గ్రామీణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. PMAY కింద ఏపీకి 4 లక్షల ఇళ్లు మంజూరు కానున్నాయి.
AP News: సొంత ఇల్లు లేని పేదలకు శుభవార్త.. 4 లక్షల ఇళ్లు మంజూరు.!
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత గూడు లేని గ్రామీణ పేద ప్రజలకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G 2.0) పథకం కింద రాష్ట్రానికి కొత్తగా భారీ సంఖ్యలో ఇళ్లను కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు అన్ని వసతులతో కూడిన పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు, పూరి గుడిసెల్లో ఉన్నవారికి శాశ్వత గృహ వసతి కల్పించనున్నారు.
తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం PMAY గ్రామీణ్-2.0 పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల పక్కా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే అధికారికంగా మంజూరు చేయనుంది.
ఇప్పటికే ఈ పథకంలో భాగంగా రాష్ట్రానికి మొదటి విడతలో దాదాపు 77 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఆ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇప్పుడు అదనంగా మరో 4 లక్షల ఇళ్లు ఒకేసారి మంజూరు కానుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం కానుంది.
కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడగానే జిల్లాల వారీగా, మండలాల వారీగా అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.2.39 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నాయి. లబ్ధిదారుడు చేపట్టే ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా ఈ నగదును విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తారు.
పునాది స్థాయి, గోడల నిర్మాణం, పైకప్పు లెవెల్, పూర్తి స్థాయి ఫినిషింగ్ దశల్లో గ్రామ సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జియో ట్యాగింగ్ నిర్వహించిన వెంటనే నిధులను ఖాతాకు విడుదల చేస్తారు. దీనివల్ల మధ్యవర్తుల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పేదలకు అందుతుంది.
గ్రామాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు పక్కా గృహాన్ని అందించేలా అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.
ఈ 4 లక్షల ఇళ్ల మంజూరుతో గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులకు సరికొత్త ఊపు రానుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ లాంటి నిర్మాణ సామగ్రి సకాలంలో అందేలా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడి జిల్లాల వారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.




