New Pensions: కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారా?.. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇవే.. మిస్ కావద్దు
New Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
New Pensions
New Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఆమోదం కోసం స్పష్టమైన కాలపరిమితితో కూడిన అధికారిక మార్గదర్శకాలను జారీ చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు పింఛన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై కొత్త పింఛన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాలు అనబడే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలోలాగా అధికారుల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా స్థానిక కార్యాలయాల ద్వారానే అర్హులు తమ పత్రాలను సమర్పించే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి లంచాలు, సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పక్కా కాలపరిమితి.. జిల్లా కలెక్టర్ల నిఘా
ఈసారి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ నుంచి మంజూరు వరకు ప్రతి దశకు ఒక నిర్దిష్ట కాలపరిమితిని విధించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలనను మరింత కఠినతరం చేయనున్నారు. కలెక్టర్లు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎక్కడా దరఖాస్తులు పెండింగ్లో పడిపోకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయి అధికారులు దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి భౌతిక తనిఖీ నిర్వహించనున్నారు.
కొత్త పెన్షన్ల పూర్తి షెడ్యూల్ వివరాలు
ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక ప్రకారం నేటి(సెప్టెంబర్ 7) నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, వార్డుల్లో కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అధికారుల బృందం ప్రాథమిక అర్హతలను నిశితంగా పరిశీలిస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య కాలంలో భౌతిక, శాఖాపరమైన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. చివరగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో అర్హుల జాబితా ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం అనంతరం దశలవారీగా కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు.
28 కేటగిరీల లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా
కేవలం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకే కాకుండా మొత్తం 28 రకాల కేటగిరీలకు సంబంధించిన అర్హులకు ఎన్టీఆర్ భరోసా పథకం వర్తింపజేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఒంటరి మహిళలు, విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆయా కేటగిరీలకు నిర్దేశించిన ప్రత్యేక ధృవపత్రాలు, వైద్య నివేదికలను దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.




