Nellore: NH-16 పై ట్రాఫిక్ నరకం.. ఆర్‌ఓబీ పనులు మొదలుపెట్టండి

Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్ - బిట్రగుంట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్‌ఓబీ (ROB) పనులను వెంటనే ప్రారంభించాలని NHAI చైర్మన్‌కు ఎంపీ బీద మస్తాన్‌రావు యాదవ్ లేఖ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:04 PM IST
Nellore
X

Nellore: NH-16 పై ట్రాఫిక్ నరకం.. ఆర్‌ఓబీ పనులు మొదలుపెట్టండి

Nellore: ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని అనంతవరం సమీపంలో ఎన్‌హెచ్-16 పై ఉన్న అల్లూరు రోడ్–బిట్రగుంట రైల్వే క్రాసింగ్ (ఎల్‌సీ నెం.144) వద్ద, ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాల్సిందిగా కోరారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు యాదవ్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ (IAS )కు నేరుగా లేఖ సమర్పించారు.

ఈ సందర్భంగా బీద మస్తాన్‌రావు యాదవ్ మాట్లాడుతూ..

అల్లూరు రోడ్ రైల్వే గేట్ వద్ద చాలా కాలంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య నెలకొని ఉందన్నారు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారి మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ఎన్‌హెచ్-16 పై ఈ రైల్వే క్రాసింగ్ ఉండటంతో, గేట్ మూసివేసే ప్రతిసారీ, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వాహనాలు, అలాగే అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో వచ్చిన సమాధానాల ప్రకారం.. ఈ ROB ఇప్పటికే మంజూరు కావడంతో పాటు, అలైన్‌మెంట్ ప్లాన్ మరియు జనరల్ అరేంజ్‌మెంట్ డ్రాయింగ్ (GAD) కూడా ఖరారైందని, అయినప్పటికీ ఇప్పటివరకు భౌతిక పనులు ప్రారంభం కాకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టును ఇకపై మరింత ఆలస్యం చేయరాదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, NHAI, రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంబంధిత అధికారులతో తక్షణం సమన్వయం చేసి, పెండింగ్‌లో ఉన్న ఫైల్ స్థాయి మరియు విభాగాల మధ్య సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కోరారు. అలాగే, పనుల ప్రారంభానికి స్పష్టమైన గడువు నిర్ణయించి, వీలైనంత త్వరగా స్థలంలో భౌతిక పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని NHAI చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ని ఆయన అభ్యర్థించారు.

అల్లూరు రోడ్ వద్ద ROB నిర్మాణం పూర్తయితే ప్రమాదాలకు గురయ్యే ఈ కీలక ప్రాంతానికి, శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, ఎన్‌హెచ్-16 పై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజల ప్రాణ భద్రత మెరుగుపడుతుందని బీద మస్తాన్‌రావు యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ఈ ROB పనులను అత్యవసర ప్రజా ప్రయోజన అంశంగా పరిగణించి వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు బీద మస్తాన్ రావు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story