Rayadurgam: క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!
Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీలను ప్రారంభించారు.
Rayadurgam: క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!
రాయదుర్గం: అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రవ్యాప్తంగా జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు చివరి వరకు కొనసాగుతోంది. ఈ పోటీల్లో అనంతపురం జిల్లా యువ క్రీడాకారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3 లక్షలకుపైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) తెలిపింది.నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి, విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తున్నారు.
అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత కల్పిస్తారు.పోటీలు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ తదితర 12 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. మొత్తం బహుమతి నిధి సుమారు ₹94 లక్షలు. ఈ సందర్బంగా రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్–2026 కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
అమరావతి ఛాంపియన్షిప్–2026 వంటి పోటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరిచే అవకాశాలను కల్పిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




