Rayadurgam: అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల నిర్వహణ!
Rayadurgam: ప్రభుత్వ హైస్కూల్ లో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
Rayadurgam: అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల నిర్వహణ!
రాయదుర్గం: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ (2026) క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
క్రీడాకారులు కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ఐకమత్యంతో తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. గెలిచిన వారిని అభినందించడంతో పాటు ఓడిన క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాది ఓడిపోయిన వారు వచ్చే ఏడాది మరింత పట్టుదలతో కృషి చేసి విజయం సాధించవచ్చని సూచించారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఏ క్రీడాకారుడు విజయం సాధించినా అది మొత్తం నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఉంటే జీవితంలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం వల్లే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి నాయకులు అవిశ్రాంతంగా ప్రజా సేవలో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.




