Anantapur: ఉచిత ఇసుక పేరుతో పెన్నాలో అక్రమ తవ్వకాలు
Anantapur: అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఉచిత ఇసుక పేరుతో పెన్నా నదిలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
Anantapur: ఉచిత ఇసుక పేరుతో పెన్నాలో అక్రమ తవ్వకాలు
Anantapur: కూటమి ప్రభుత్వం "ఉచిత ఇసుక" అని ప్రకటించడంతో అనంతపురం జిల్లా పామిడి మండలం పెన్నా నది పూర్తిగా అల్లకల్లోలంగా మారింది.
గుంతకల్లు పట్టణం తో పాటు సుదూర ప్రాంతాలకు సైతం ఇష్టానుసారంగా ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు పెన్నా నదిలోకి దిగి ఇసుకను తోడేస్తున్నాయి.
ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50 అడుగులకు వచ్చే బోర్లు ఇప్పుడు 200 అడుగులకు పైగా వేసినా నీరు రావడం లేదని వాపోతున్నారు.
దీంతో పాటు గ్రామాల మీదుగా వెళ్లే రోడ్లన్నీ దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి. ఇసుక వాహనాల వల్ల గాలిలో దుమ్ము ఎగిరి ప్రజలు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కంట్లో దుమ్ము పడి ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఓవర్ లోడ్ ట్రాక్టర్లు వేగంగా రావడంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. అయినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న ఈ అక్రమ తరలింపును వెంటనే అడ్డుకోవాలని, పెన్నా పర్యావరణాన్ని కాపాడాలని, ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.




