Kadiri: ముదిగుబ్బ - కదిరి ఫోర్ లేన్ రోడ్డుకు కేంద్రం భారీ నిధులు
Kadiri: ముదిగుబ్బ-కదిరి జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ. 679 కోట్లు మంజూరు చేయడంపై బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Kadiri: ముదిగుబ్బ - కదిరి ఫోర్ లేన్ రోడ్డుకు కేంద్రం భారీ నిధులు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ నుంచి కదిరి వరకు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.679 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల జిల్లాకు చెందిన బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కదిరి పట్టణంలోని శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రహదారి రవాణా మరింత సులభతరం కావడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఈ కీలక నిర్ణయం తీసుకున్న దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రహదారుల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తోందని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్, కుటాగుళ్ళ వెంకటేష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి హరీ నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి, DL ఆంజనేయులు, మేకల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.




