Anantapur: కార్యకర్తలే పార్టీకి బలగం - అనంత వెంకటరామిరెడ్డి
Anantapur: అనంతపురంలో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్థానిక ఎన్నికల సన్నాహాలపై మాట్లాడి, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
Anantapur: కార్యకర్తలే పార్టీకి బలగం - అనంత వెంకటరామిరెడ్డి
అనంతపూర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీలక నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
"కార్యకర్తే మన పార్టీకి దేవుడు.. కార్యకర్తే మన పార్టీకి నాయకుడు" అనే నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త నడుము బిగించి, వైసీపీని ఘనవిజయ తీరాలకు చేర్చడానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.ఎన్నికల సమయంలో పోలీసులు లేదా అధికార యంత్రాంగం ద్వారా భయాందోళనలు సృష్టించి, వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు చేసే అవకాశం ఉందని.. ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
పార్టీ నాయకత్వం పూర్తి రక్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలందరూ ఐక్యంగా పోరాడి పార్టీ జెండాను ఎగురవేయాలని ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి కోరారు.




