Anantapur: అనంతపురంలో ఘోర అగ్నిప్రమాదం తగలబడిన గడ్డివాము
Anantapur: అనంతపురం గుత్తి రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Anantapur: అనంతపురంలో ఘోర అగ్నిప్రమాదం తగలబడిన గడ్డివాము
Anantapur: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివారులోని గుత్తి రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భారీగా నిల్వ ఉంచిన గడ్డివాము పూర్తిగా బూడిదైంది.
అనంతపురం గుత్తి రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలో సునీల్ అనే వ్యాపారి పశువుల మేత కోసం పెద్ద ఎత్తున గడ్డిని నిల్వ ఉంచాడు. మార్కెట్కు వచ్చే పశువులు, గొర్రెల కోసం స్థానిక రైతులు, వ్యాపారులు ఇక్కడి నుంచే గడ్డిని కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తుంటారు.
అయితే, రాత్రి సమయంలో ఈ గడ్డివాముకు అనుమానాస్పద స్థితిలో మంటలు అంటుకున్నాయి. సమీపంలోనే మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఉండటంతో.. అక్కడి నుంచే పొగ వస్తోందని స్థానికులు మొదట భావించారు. కానీ, మంటలు పెద్దవిగా మారడంతో అసలు విషయం గ్రహించి ఆలస్యంగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆలస్యం కావడంతో గడ్డివాము పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో తనకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారి సునీల్ కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఒకటో పట్టణ (One Town) పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు అంటుకున్నాయా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.




