Anantapur: ఆగస్టు 24, 25 తేదీల్లో ఏఐఎస్బీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు!
Anantapur: ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్బీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు.
Anantapur: ఆగస్టు 24, 25 తేదీల్లో ఏఐఎస్బీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు!
అనంతపురం: ఆగస్టు 24, 25 తేదీల్లో నెల్లూరు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి పిలుపునిచ్చారు.
బుధవారం అనంతపురం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77ను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా విద్యార్థి సంఘాలను హాస్టళ్లలోకి అనుమతించకూడదంటూ సర్క్యులర్ జారీ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఉపాధ్యాయులు, వార్డెన్లు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయడం,రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, మెస్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు వంటి డిమాండ్లపై విద్యార్థులను పోరాటాలకు సన్నద్ధం చేసేందుకు నెల్లూరులో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ నాయకులు గౌతమ్, ఇంతియాజ్, మనోహర్, మంజు, సాయినాథ్, మహేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




