Amaravati: తెలుగుదేశం 'లీడర్షిప్ కాంక్లేవ్' అమరావతిలో నేటి నుంచి శిక్షణ!
Amaravati: కొత్త తరం నాయకులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల 'లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్'.
Amaravati: తెలుగుదేశం 'లీడర్షిప్ కాంక్లేవ్' అమరావతిలో నేటి నుంచి శిక్షణ!
Amaravati: రాజకీయాల్లో కొత్త తరానికి నాయకత్వ లక్షణాలు, పార్టీ వ్యవహారాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి కీలక నేతలకు రెండు రోజుల పాటు నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేటి నుంచి ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ నిర్వహించనున్నారు.
పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కేవలం ఉపన్యాసాలు, ప్రసంగాలకే పరిమితం కాకుండా నాయకులు, శిక్షణ ఇచ్చే నిపుణుల మధ్య ప్రత్యక్ష సంభాషణ, ప్రశ్నలు–సమాధానాలు, గ్రూప్ డిస్కషన్స్ వంటి ఇంటరాక్టివ్ విధానంలో కాంక్లేవ్ను నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజలతో నాయకులు ఎలా మమేకం కావాలి? నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఎలా సమన్వయం చేసుకోవాలి? ప్రజా సమస్యలను ఎలా గుర్తించి పరిష్కారానికి తీసుకెళ్లాలి? పార్టీ విధానాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా ఎలా తీసుకెళ్లాలి? సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించాలి? వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వంలో రావాల్సిన మార్పులపైనా చర్చించనున్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం, కేడర్ను సమన్వయం చేయడం, ప్రత్యర్థి పార్టీల విమర్శలకు సమర్థవంతంగా స్పందించడం, ప్రభుత్వ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై నేతలకు అవగాహన కల్పించనున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వ సామర్థ్యాల పెంపుపై ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇటీవల కాలంలో రాజకీయాల్లో సాంకేతికత, సోషల్ మీడియా, డేటా ఆధారిత వ్యూహాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. కొత్త తరం నాయకులు ఈ అంశాల్లోనూ పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలన్నది టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
పార్టీ కార్యక్రమాలను కేవలం నిర్వహించడం కాకుండా వాటి ఫలితాలను ప్రజలకు చేరవేయడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వంటి అంశాలపై కూడా నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.
లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ద్వారా టీడీపీలో కొత్త నాయకత్వానికి బలమైన పునాది వేయాలని అధిష్ఠానం భావిస్తోంది. భవిష్యత్లో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలను ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతల్లో పెంపొందించడమే ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.




