AP: ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ ఎత్తివేత!
AP: సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP: ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ ఎత్తివేత!
AP: సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారులపై గతంలో విధించిన సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఇద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
విశాల్ గున్ని 2010 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి కాగా.. కాంతి రాణా టాటా 2004 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం సస్పెన్షన్ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. గడువును పొడిగిస్తూ వచ్చింది.
ప్రస్తుతం వీరిద్దరి సస్పెన్షన్ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను మరింత పొడిగించాలా.. లేక ఎత్తివేయాలా అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీపీ, హెచ్ఓపీఎఫ్ నుంచి అందిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. అధికారుల సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి డీజీపీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
మరోవైపు కాంతి రాణా టాటా ఆగస్టు 24న ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించింది. డీజీపీ నివేదికతో పాటు అధికారుల నుంచి అందిన వివరాలు, సస్పెన్షన్కు సంబంధించిన అంశాలు, ఇతర పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించింది.
దీంతో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం ముగిసేలోపే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై ఇద్దరు అధికారులు ప్రభుత్వ కేటాయించే విధుల్లో కొనసాగనున్నారు.




