పోలవరం.. సాగునీటి ప్రాజెక్టు నుంచి టూరిజం ఐకాన్ దిశగా..

Amaravati: పోలవరం ప్రాజెక్ట్ పరిధిలో 10 వేల ఎకరాల్లో లైడార్ సర్వే. జపాన్ నిప్పాన్ కోయి సంస్థ డిజైన్లతో అంతర్జాతీయ పర్యాటక కారిడార్‌గా మార్పు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 July 2026 9:42 PM IST
Amaravati
X

పోలవరం.. సాగునీటి ప్రాజెక్టు నుంచి టూరిజం ఐకాన్ దిశగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును ఇక కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు చుట్టూ టూరిజం, సంస్కృతి, వినోదం, ప్రకృతి అందాలను సమన్వయం చేస్తూ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తెలుగుదనం, రాష్ట్ర ఔన్నత్యం ప్రతిబింబించేలా పోలవరం స్పిల్‌వే, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక డిజైన్లు సిద్ధమవుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు పరిధిలో దాదాపు 10 వేల ఎకరాలను లైడార్ సర్వే ద్వారా గుర్తించి సమగ్ర టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్‌లను కలిపే వంతెనలు, ఆధునిక రహదారులు, సందర్శకుల సౌకర్యాలకు అవసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి నగరాలను జాతీయ రహదారుల ద్వారా పోలవరంతో అనుసంధానం చేసే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. దీంతో పోలవరం చేరుకోవడం మరింత సులభమై, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పోలవరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు విస్తరించే గోదావరి ప్రాంతాన్ని ఒక సమగ్ర టూరిజం కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం జపాన్‌కు చెందిన నిప్పాన్ కోయి సంస్థ రూపొందించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ ప్రణాళికల్లో ప్రకృతి అందాలకు భంగం కలగకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ డ్యామ్‌ల తరహాలో పోలవరాన్ని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

గోదావరి నది వైభవం, పరివాహక ప్రాంత గిరిజన సంస్కృతి, తెలుగు వారసత్వాన్ని ఒకే చోట చూపించే మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్ కేంద్రాలు, టెంపుల్ టూరిజం, రిసార్టులు, హట్స్, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు వంటి అనేక ప్రాజెక్టులను ఈ మాస్టర్ ప్లాన్‌లో చేర్చనున్నారు. దీంతో పోలవరం కేవలం సాగునీటి అవసరాలకే పరిమితం కాకుండా ఉపాధి, పర్యాటకం, స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ డిజైన్లను స్వయంగా పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నారు. ప్రణాళికలు కార్యరూపం దాల్చితే పోలవరం ప్రాజెక్టు నీటి వనరులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కూడా కొత్త గుర్తింపును తీసుకురానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story