Chandrababu Naidu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం!

Chandrababu Naidu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమలకు బయలుదేరారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Sept 2026 5:55 PM IST
Chandrababu Naidu
X

Chandrababu Naidu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం!

Chandrababu Naidu: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు బయలుదేరారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమల చేరుకున్న అనంతరం ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రాత్రి 7.40 గంటల సమయంలో తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రభుత్వం తరఫున వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి టీటీడీ అధికారులు, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచించే ధ్వజారోహణ కార్యక్రమంలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ధ్వజారోహణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాల నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.