రంపచోడవరంలో సీఎం చంద్రబాబు పర్యటన టీచర్ పేరెంట్ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

Amaravati: రంపచోవరంలో నాల్గో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 July 2026 8:14 PM IST
Amaravati
X

రంపచోడవరంలో సీఎం చంద్రబాబు పర్యటన టీచర్ పేరెంట్ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ హైస్కూల్–జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే నాలుగో **మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లు విద్యా రంగంలో కొత్త సంస్కృతికి నాంది పలికాయి. విద్యార్థుల చదువు, హాజరు, ప్రవర్తన, ప్రతిభ, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో చర్చించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ సమావేశాల ద్వారా పాఠశాలలపై తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరగడంతో పాటు విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచన పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రంపచోడవరం పర్యటనలో ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, విద్యార్థుల అభిప్రాయాలు, పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను ఆయన నేరుగా తెలుసుకోనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి ఆశయాలు, సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై మరింత విశ్వాసం పెంచే ప్రయత్నం చేయనున్నారు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి తల్లులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విద్య కోసం అందుతున్న ఆర్థిక సాయం కుటుంబాలపై ఎంత మేర భారం తగ్గించింది, పిల్లల చదువుపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు.

ఈ పర్యటనలో నిర్వహించే ప్రజావేదిక సభలో ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ విద్య, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేయనున్నారు.

పర్యటన చివరిలో ఐ. పోలవరంలో టీడీపీ కార్యకర్తలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

రంపచోడవరం పర్యటన కేవలం అధికారిక కార్యక్రమంగానే కాకుండా విద్యా సంస్కరణలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెంపు, "తల్లికి వందనం" పథకం ప్రభావాన్ని ప్రత్యక్షంగా అంచనా వేసే కీలక కార్యక్రమంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న మార్పులకు ఈ పర్యటన మరో మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story