Amaravati: ఫీనిక్స్ సెటిల్మెంట్లో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
Amaravati: దక్షిణాఫ్రికాలోని చారిత్రక ఫీనిక్స్ సెటిల్మెంట్, సర్వోదయ హౌస్ను సందర్శించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మహాత్మా గాంధీకి ఘన నివాళి.
Amaravati: ఫీనిక్స్ సెటిల్మెంట్లో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దక్షిణాఫ్రికాలోని చారిత్రక ఫీనిక్స్ సెటిల్మెంట్ను సందర్శించారు. డర్బన్లోని ఇనాండా ప్రాంతంలో ఉన్న ఈ చారిత్రక ప్రదేశం మహాత్మాగాంధీ సత్యాగ్రహం, సర్వోదయ సిద్ధాంతాలకు పునాదిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమాల చరిత్రను గుర్తు చేసుకుంటూ స్పీకర్ ఈ ప్రాంతంలోని పలు చారిత్రక ప్రదేశాలను పరిశీలించారు.
ఫీనిక్స్ సెటిల్మెంట్లోని సర్వోదయ హౌస్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీ నివసించిన ఇంటిని స్పీకర్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ ప్రాంగణాన్ని పరిశీలించారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికను ఇదే ప్రెస్లో ముద్రించేవారు. ఈ ప్రదేశం గాంధీజీ ఆలోచనలు, ఉద్యమ చరిత్రకు ముఖ్యమైన గుర్తుగా నిలిచింది.
స్పీకర్తో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఫీనిక్స్ సెటిల్మెంట్లోని కస్తూర్బా గాంధీ ప్రాథమిక పాఠశాలను కూడా వారు సందర్శించారు. గాంధీజీ, కస్తూర్బా గాంధీ ఆశయాలకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ స్థానిక సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల నిర్వాహకులను స్పీకర్ అభినందించారు.
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మునిమనవరాలు, ప్రముఖ యాంటీ-అపార్ట్హెయిడ్ కార్యకర్త, మాజీ ఎంపీ డాక్టర్ ఎలాగాంధీ కుమారుడు కిదార్ రామ్గోబిన్ స్పీకర్కు ఘన స్వాగతం పలికారు. ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలపై స్పీకర్ ఆయనతో చర్చించారు. గాంధీ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, భారత్–దక్షిణాఫ్రికా మధ్య విద్యా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది...
కిదార్ రామ్గోబిన్ స్పీకర్ బృందానికి ఫీనిక్స్ సెటిల్మెంట్లోని ప్రధాన చారిత్రక ప్రదేశాలను చూపించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు ఆయనకు పెదన చేతితో నేసిన, చేతితో ముద్రించిన కలంకారీ శాలువాను కప్పి సత్కరించారు. అలాగే ఏటికొప్పాక హస్తకళా వస్తువును జ్ఞాపికగా అందజేశారు.
ఫీనిక్స్ సెటిల్మెంట్ సందర్శన తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సత్యాగ్రహానికి పుట్టినిల్లు వంటి ఈ ప్రదేశంలోనే మహాత్మాగాంధీ సత్యం, అహింస ఆధారంగా నైతిక, రాజకీయ పోరాటాలకు మార్గం చూపారని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం, స్థానిక సమాజం కలిసి కస్తూర్బా పాఠశాలను నిర్వహించడం, చారిత్రక వారసత్వాన్ని కాపాడటం భారత్–దక్షిణాఫ్రికా సంబంధాలకు స్ఫూర్తిదాయకమైన వారధిగా నిలుస్తోందన్నారు.
అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు డర్బన్లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇండియా హౌస్ను సందర్శించారు. కాన్సుల్ జనరల్ నితిన్ సుభాష్ యేవోలా ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన స్పీకర్.. దక్షిణాఫ్రికాలోని భారతీయ ప్రవాసుల సమస్యలు, ఇరు దేశాల అభివృద్ధికి పరస్పర సహకారాన్ని మరింత పెంచాల్సిన అవసరంపై చర్చించారు.




