Amaravati: అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర్య వేడుకలు.. ప్రజలకూ ప్రత్యేక ఆహ్వానం..
Amaravati: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Amaravati: ప్రజలకు ఏపీ అసెంబ్లీ తలపులు తెరిచారు రెండు రోజులు సందర్శనకు అవకాశం!
Amaravati: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రజలను భాగస్వామ్యం చేసేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అసెంబ్లీని సరికొత్తగా అలంకరించడంతో పాటు, ఆ అందాలను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రాంగణం సందర్శకులతో సందడిగా మారనుంది.
స్వాతంత్ర్య దినోత్సవం అంటే జెండా ఆవిష్కరణ, దేశభక్తి గీతాలు, అధికారిక ప్రసంగాలకే పరిమితం కాకుండా.. ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ప్రజలకు పరిమితంగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణాన్ని విద్యార్థులు, కుటుంబాలతో వచ్చే సందర్శకులు, వివిధ వర్గాల ప్రజలు చూసే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అసెంబ్లీ భవనాన్ని జాతీయ జెండా రంగులు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ అలంకరణలను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా నేడు, రేపు ప్రత్యేకంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అసెంబ్లీ భవనం, ప్రాంగణంలోని ప్రత్యేక అలంకరణలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచే అసెంబ్లీని సందర్శించే అవకాశం విద్యార్థులకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. పుస్తకాల్లో చదివే ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంతో పాటు.. రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలు జరిగే ప్రాంగణాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం వారికి దక్కనుంది. దీంతో విద్యార్థుల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వాతంత్ర్య పోరాటం పట్ల మరింత అవగాహన పెంచేలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి.
వేడుకల్లో పోలీసు బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశభక్తి గీతాలతో పోలీసు బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించనుండగా.. మరోవైపు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులు, విద్యార్థుల ప్రదర్శనలతో అసెంబ్లీ ప్రాంగణం రెండు రోజుల పాటు దేశభక్తి, సాంస్కృతిక వైభవంతో కళకళలాడనుంది.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజాస్వామ్యానికి నిలయమైన శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య వేడుకల వాతావరణాన్ని ప్రజలే ప్రత్యక్షంగా ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయడం విశేషం.
రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు అసెంబ్లీని ఒక సందర్శనా ప్రదేశంగా మాత్రమే కాకుండా.. స్వాతంత్ర్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను ప్రజలకు చేరువ చేసే వేదికగా నిలపనున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వాతంత్ర్య వేడుకల ఉత్సాహాన్ని పంచుకునేలా కార్యక్రమాలను రూపొందించారు. మొత్తంగా.. ఈసారి అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవం అధికారిక వేడుకగా మాత్రమే కాకుండా.. ప్రజల పండుగగా మారనుంది.




