Nirmal: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి కలెక్టర్
Nirmal: నిర్మల్ జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, భక్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం.
Nirmal: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి కలెక్టర్
నిర్మల్: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కరాల పనులు, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు పలు జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా బాసర పుష్కర ఘాట్కు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు తదితర మౌలిక వసతులను తగినన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో పుష్కర ఘాట్లకు మరమ్మతులు చేపట్టి, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పుష్కరాల కోసం చేపట్టే ప్రతి పనిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన పుష్కర అనుభవం కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల ఈఈలు సందీప్, అనిల్, శంకర్, అగ్నిమాపక అధికారి శివాజీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




