Nirmal: బాసరలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీలు
Nirmal: బాసరలో ఇన్చార్జి మంత్రి జూపల్లి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. అనంతరం భైంసాలో ఎస్ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేశారు.
Nirmal: బాసరలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీలు
నిర్మల్: నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శనివారం బాసరలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, గోదావరి నది పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాల షెడ్యూల్కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం భైంసా తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు.
నోటీసుల జారీ, తదుపరి ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వారి సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇరిగేషన్, ఆర్అండ్బీ ఈఈలు అనిల్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, తహసీల్దార్లు పవన్ చంద్ర, శశి భూషణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




