Nirmal: మట్టి వినాయకులనే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందాం: నిర్మల్ కలెక్టర్

Nirmal: పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని పిలుపునిస్తూ నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 8 Sept 2026 8:51 PM IST
Nirmal
X

Nirmal: మట్టి వినాయకులనే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందాం: నిర్మల్ కలెక్టర్

నిర్మల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణహితంగా గణేష్‌ ఉత్సవాలను నిర్వహిస్తూ, జలవనరులను కాలుష్యం నుంచి కాపాడాలని సూచించారు.

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమన్వయంతో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ, మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పోస్టర్లను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలవనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా పీవోపీ విగ్రహాలు సులభంగా కరగకపోవడం వల్ల చెరువులు, నదులు, ఇతర జలవనరుల్లో కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు.

రసాయన రంగుల్లోని హానికర పదార్థాలు నీటిలో కలవడం వల్ల జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడటంతో పాటు, ఆ నీటిని వినియోగించే ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అందువల్ల పర్యావరణానికి హాని కలగకుండా సంప్రదాయబద్ధంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించి పూజించాలని సూచించారు.

మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భక్తి భావంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బి. తిరుపతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story