Gudihathnoor: గుడిహత్నూర్లో కపాస్ క్రాంతి పత్తి పంట పొలాలను పరిశీలించిన అధికారులు!
Gudihathnoor: అధిక సాంద్రత పద్ధతితో పత్తి సాగులో అధిక దిగుబడులు.. గుడిహత్నూర్లో పంటలను పరిశీలించిన డైరెక్టరేట్ డైరెక్టర్ వాఘ్మారే.
Gudihathnoor: గుడిహత్నూర్లో కపాస్ క్రాంతి పత్తి పంట పొలాలను పరిశీలించిన అధికారులు!
Gudihathnoor: కపాస్ క్రాంతి పథకంలో భాగంగా పత్తి ఉత్పాదకత మిషన్ ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహించేందుకు నూరు శాతం రాయితీపై పత్తి విత్తనాలు పొందిన రైతుల పంట పొలాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగ్పూర్ పత్తి అభివృద్ధి డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్. వాఘ్మారే వైజాపూర్, సీతాగోంది, కమలాపూర్ శివారులలో పర్యటించి, రైతులు అధిక సాంద్రత విధానంలో సాగు చేస్తున్న పత్తి పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎకరాకు సుమారు 15,000 నుండి 25,000 వరకు మొక్కలు ఉంటాయని, మొక్కకు మొక్కకు మధ్య ఒక అడుగు దూరం ఉండడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు.
నాటిన 45 రోజుల తర్వాత మెపిక్యాట్ క్లోరైడ్ పెరుగుదల నియంత్రికను వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం వల్ల మొక్కల ఎత్తు మరియు కొమ్మల అధిక పెరుగుదలను అదుపు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల పూత, కాయల ఉత్పత్తికి మొక్కలోని పోషకాలు సమర్థవంతంగా వినియోగపడి అధిక దిగుబడులు వస్తాయన్నారు.
అలాగే చీడపీడల నివారణకు సిఫార్సు మేరకు మాత్రమే క్రిమిసంహారక మందులు వాడాలని, నానో యూరియా మరియు నానో డీఏపీలను పిచికారీ చేసి పంటలను సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి రాజేందర్ సింగ్, సహాయ వ్యవసాయ సంచాలకులు రామకిషన్, ఇచ్ఛోడ మరియు బోథ్ డివిజన్ సాంకేతిక వ్యవసాయ అధికారులు శ్రీధర్ స్వామి, విశ్వామిత్ర, గుడిహత్నూర్ మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రమణతో పాటు స్థానిక రైతులు నితీష్ రెడ్డి, బాపురావ్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.




