Adilabad: బజార్హత్నూర్లో ఎస్సీ బాలుర వసతి గృహం ప్రారంభం
Adilabad: బజార్హత్నూర్లో ఎస్సీ బాలుర హాస్టల్ను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
Adilabad: బజార్హత్నూర్లో ఎస్సీ బాలుర వసతి గృహం ప్రారంభం
ఆదిలాబాద్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బజార్హత్నూర్ లోని జిల్లా జడ్పి పాఠశాలలో షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని స్థానిక శాసన సభ్యులు అనిల్ జాదవ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బజార్హత్నూర్లో ఎస్సీ, బీసీ హాస్టళ్ల నూతన భవనాల నిర్మాణానికి త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో త్వరలోనే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని, కొల్హారిలో హరిరామ్, హరికృష్ణ అందజేసిన గోడౌన్ను ఇందుకు సద్వినియోగం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
అలాగే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కటి వ్యక్తిగత వికాసం, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సమాచార మార్పిడి నైపుణ్యాలను పెంపొందించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగట్లతో పాటు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ విద్యనభ్యసించాలని సూచించారు. అలాగే కొత్త యూనిఫాంలు, షూలు అందించనున్నట్లు తెలిపారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుంటే తల్లిదండ్రుల పేరుతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల పేరును కూడా నిలబెట్టవచ్చన్నారు. తాను సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని నేడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్టిఫైడ్ ఉపాధ్యాయులు, అత్యుత్తమ బోధన అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.




