Warangal: వైఎస్సార్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

Warangal: ప్రొ.జయశంకర్‌కు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల * రాణి రుద్రమదేవి, కాళోజీ పుట్టిన గడ్డ వరంగల్‌ -షర్మిల

Sandeep Eggoju
Published on: 10 March 2021 4:11 PM IST
YS Sharmila Meeting in Warangal District
X

వైఎస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

Warangal: హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వరంగల్‌ జిల్లా వైఎస్సార్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వైఎస్‌ షర్మిల. ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళులర్పించిన షర్మిల రాణి రుద్రమ దేవి పుట్టిన గడ్డ వరంగల్‌ అని, ఓరుగల్లు సాంస్కృతిక రాజధాని అని అన్నారు. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జాతీయ గీతం రాసిన అందెశ్రీ ది వరంగల్‌ అని, కాళోజీ పుట్టిన గడ్డ వరంగల్‌ అంటూ గుర్తుచేశారు.

ఎంతో మంది ఉద్యమ, కళాకారులను వరంగల్‌ అందించిందని కొనియాడారు. వరంగల్‌తో వైఎస్సార్‌కు తీరని అనుబంధం ఉందన్న షర్మిల శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ను 80 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి బతికుంటే.. వరంగల్‌ అభివృద్ధిలో దూసుకుపోయేదని, వరంగల్‌ సిటీని, ఐటీ సిటీగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌ అనుకున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరంగల్‌ అభివృద్ధిని పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు షర్మిల. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందో చెప్పాలన్నారు. వరంగల్‌ను స్మార్ట్‌ సిటీగా చేస్తానన్నారు.. కనీసం కాకతీయ యూనివర్సిటీకి వీసీ కూడా దిక్కులేరని ఆరోపించారు. ఈ విషయంపై విద్యార్థులు ప్రశ్నిస్తే.. దాడులు జరిపారని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story