
హైదరాబాద్ తార్నాకలో మహిళపై గ్యాంగ్రేప్, స్నేహితులతో కలిసి..
Hyderabad: నలుగురు మిత్రులను పిలిచి మహిళపై గ్యాంగ్ రేప్
Hyderabad: మేక వన్నె పులులు మన చుట్టే ఉన్నాయని మరోసారి నిరూపితం అయిన ఘటన ఇది. చూడటానికి అందరూ సౌమ్యులుగానే కనిపిస్తారు. నాలుగు మంచి మాటలు చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తారు. సాయం పేరుతో ఎర వేస్తారు. అదంతా నిజమే అనుకుని అమాయకంగా నమ్మారో ఇక అంతే సంగతి. జీవితాలను ఛిద్రం చేస్తారు. లిఫ్ట్ పేరుతో అర్థరాత్రి ఓ ఆడ బిడ్డను చెరబట్టిన దారుణ ఘటన హైదరాబాద్ నడి బొడ్డున చోటు చేసుకుంది. సాయం పేరుతో మహిళను వంచించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కీచకపర్వానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను కూడా పిలిపించి గ్యాంగ్ రేప్ చేశారు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళలకు అసలు రక్షణే లేదా..? అర్థరాత్రి ఒంటరిగా కనిపిస్తే చాలు దారుణాలకు పాల్పడుతారా..? ఈ ఘోరం, ఈ దారుణం ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. ఆధునిక సమాజం, హైటెక్ సిటీగా గొప్పగా చెప్పుకునే గ్రేటర్ హైదరాబాద్లో ఈ పైశాచికత్వం చోటు చేసుకుంది. కళ్లనిండా కామాన్ని నింపుకున్న కీచకులు ఒంటరి మహిళపై ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. రాత్రి తార్నాకలో బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను.. లిఫ్ట్ పేరుతో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్లో మహిళల భద్రతపై మరోసారి అనుమానాలను రేకెత్తుతున్నాయి. భయాందోళనలకు దారితీసింది.
డిసెంబర్ 7న అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు నిర్దారించారు. తార్నాకలోని బస్టాండ్ లో ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ప్రశాంత్ నగర్ కు చెందిన 32ఏళ్ల బర్నే యేసు అనే వ్యక్తి ఆమెను చూశాడు. మెల్లిగా ఆమెతో మాటలు కలిపాడు. ఆ తరువాత తాను కూడా అటువైపే వెళుతున్నానని ప్రశాంత్ నగర్ లో దింపేస్తానని తెలిపాడు. అతని మాటలు నమ్మిన మహిళ బైక్ ఎక్కింది. ఆ తర్వాత ఆమెను నేరుగా నిర్మానుష్యంగా ఉన్న ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులైన మరి కొంతమందికి ఫోన్ చేసి మరీ పిలిపించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు.
బాధిత మహిళను బెదిరించారు. ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. ఈ ఐదుగురిలో ఒకరైన మధు యాదవ్ మహిళను లాలాపేటలో దింపి పరారయ్యాడు. ఆ మహిళ రాత్రి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తీవ్ర భయానికి గురైన ఆమె ఇంట్లో వారికి ఏ విషయాన్ని చెప్పలేదు. కొద్దిరోజులుగా మహిళ ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విషయం ఏంటని ఆరా తీశారు. మొదట చెప్పడానికి సంశయించిన ఆమె ఆ తర్వాత బోరున ఏడుస్తూ విషయాన్నంతా చెప్పుకొచ్చింది.
బాధితురాలు తల్లిదండ్రులు వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు మహిళ చెప్పిన ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి.. పది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి స్నేహితులైన ప్రశాంత్, మధుసూదన్, రోహిత్, తరుణ్ లను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడైన యేసు కోసం గాలిస్తున్నారు పోలీసులు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




