కేసీఆర్ రాకపై మళ్లీ సందిగ్ధం.. జనం బాట ఎప్పుడు..? అసలు ఉంటుందా ఉండదా..?

When Will KCR Come Back
x

కేసీఆర్ రాకపై మళ్లీ సందిగ్ధం.. జనం బాట ఎప్పుడు..? అసలు ఉంటుందా ఉండదా..?

Highlights

KCR: కేసీఆర్ జనాల మధ్యలోకి ఎప్పుడొస్తారు..? సర్కార్‌పై సమరం చేసేది ఎన్నడు..? రెండు మాసాలకొసారి కేవలం సభలతోనే సరిపెడతారా లేక ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతారా..?

KCR: కేసీఆర్ జనాల మధ్యలోకి ఎప్పుడొస్తారు..? సర్కార్‌పై సమరం చేసేది ఎన్నడు..? రెండు మాసాలకొసారి కేవలం సభలతోనే సరిపెడతారా లేక ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతారా..? వరంగల్ సభలో అదిగో బయలుదేరుతా,, ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనివ్వ అని హస్తాన్ని హెచ్చరించారు. గులాబీ కేడర్‌లో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. మరి చెప్పినట్టే త్వరలో ప్రజల్లోకి రానున్నారా...? లేక మాటలకే పరిమితం అవుతారా...? అసలు కేసీఆర్ ఇన్నాళ్లు ఎందుకు బయటకు రాలేదు...? కేసీఆర్ యాక్టివ్ కావడంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది...?

వరంగల్ సభ తర్వాత నుంచైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం జనాల మధ్యలోనే ఉంటారని, ప్రజా సమస్యలపై, హామీలపై సర్కార్‌ను అడుగడుగునా ప్రశ్నిస్తారని అంతా అనుకున్నారు. కానీ సభ జరిగి నేటికి పది రోజులు కావొస్తున్నా....మళ్లీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో ఇటు కారు కేడర్‌లో, అటు ప్రత్యర్థి శిబిరంలో కేసీఆర్ రాకపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. గులాబీ అధినేత జనం బాట ఎప్పుడు..? అసలు ఉంటుందా ఉండదా అని అందరిలోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ పెద్దగా బయటకు రాకపోయినా ప్రతిపక్షం లేదన్న లోటు లేకుండా కేటీఆర్, హరీష్ నేతృత్వంలో గట్టిగానే పోరాడుతున్నప్పటికీ.. స్వయంగా కేసీఆరే ప్రజా ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొంటే కారు పార్టీలో ఇంకాస్త జోష్ వస్తుందనేది ఆ లీడర్ల మాట.

రాబోయే రెండు మూడు నెలల్లో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్సు ఉంది. మరి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలన్నా.. ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లి నిలదీయాలన్నా కేసీఆర్ ఇప్పటి నుంచే జనాల్లోకి రావాలని గులాబీ లీడర్లు, కేడర్ కోరుకుంటోంది. తీరా ఎన్నికలు వచ్చాక తీరిగ్గా బయటకు వస్తానంటే.. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను చూడాల్సి వస్తుందని గులాబీ దండు అభిప్రాయపడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు అనారోగ్యం కారణంగా ఆయన బయట దిరగలేకపోయారు. ఆ ప్రభావం.. ఆర్మెళ్ల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. సరిగ్గా పార్లమెంట్‌ ఎన్నికల సమయంలోనే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడంతో.. బీఆర్ఎస్‌ ఓటు షేర్‌ను కాంగ్రెస్, బీజేపీలు పంచుకున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాతైనా కేసీఆర్ పెద్దగా జనాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. రెండు, మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ గడప తొక్కారు. కృష్ణా నది జలాల విషయంలో ఒకసారి నల్గొండ జిల్లా మీటింగ్‌లో, మరోసారి రైతుల యాసంగి పంటలు ఎండిపోతున్నాయని పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రజల్లోకి కేసీఆర్ రాలేదు. అప్పుడప్పుడు ఫామ్‌హౌస్‌, తెలంగాణ భవన్‌లో నేతలతో మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. నేతలకు దిశా నిర్దేశం చేశారు. మళ్లీ గులాబీ పార్టీ రజతోత్సవాల్లో భాగంగా.. భారీ బహిరంగ సభలో దర్శనం ఇచ్చారు. ఇకపై తాను నిత్యం జనాల్లోనే ఉంటానని,, సర్కార్‌పై సమరమే అంటూ శంఖం పూరించారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు కౌంటర్లు వేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో.. సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడితే అధికార పార్టీ నుంచి కౌంటర్లు వస్తాయని, వాటికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఐతే అసెంబ్లీకి రాకపోవడంపై..స్వయంగా కేసీఆరే వివరణ ఇచ్చారు. పిల్లలు అడిగితే సమాధానం చెప్తలేరని, మీ బూతులు వినడానికి అసెంబ్లీకి రావాలా అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కేసీఆర్.

రాజకీయంగా కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యి.. నిత్యం జనాల మధ్యనే ఉండాలని గులాబీ కేడర్ బలంగా కోరుకుంటున్న క్రమంలో.. వరంగల్‌ సభ నుంచి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఏడాదిన్నర సమయం ఇచ్చాం,, ఇక తాను త్వరలో బయటకు వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ జనం బాట ఎప్పుడు పడుతారు, పార్టీ శ్రేణులతో కలిసి సర్కార్‌పై సమరశంఖం పూరించేది ఎప్పడనే దానిపై రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఐతే ఏడాదిన్నర కాలంగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. గతంలోనూ అనేక మార్లు తాను బయటకు వస్తారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్‌గా తిరిగింది లేదు. దీంతో తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ తో ప్రజల్లోకి వస్తారా లేక కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు మాత్రమే మాట్లాడారా అనే దానిపై గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి కేసీఆర్ రాకపై ఆ పార్టీ కేడర్‌లో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రజతోత్సవ సభ ఇచ్చిన ఊపుతో కేసీఆర్ జనం బాట పట్టాలని, రాబోయే స్తానిక ఎన్నికలకు పార్టీని సర్వ సన్నద్ధం చేయాలని ఆశిస్తున్నారు. మరి ఇకనైనా కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా...? లేక మాటలకే పరిమితం అవుతారా అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories