Telangana Formation Day: ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధి బాటలో వరంగల్

Telangana Formation Day: నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.

Arun Chilukuri
Published on: 2 Jun 2021 5:07 PM IST
Telangana Formation Day: Warangal Sees Development in Last 7 Years
X

Telangana Formation Day: ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధి బాటలో వరంగల్

Telangana Formation Day: నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనలో ఆ జిల్లా స్థానం ప్రత్యేకం. పోరాటల పురుటి గడ్డగా పేరొందిన ఆ జిల్లా ఆనాడు స్వరాష్ట్ర ఉద్యమంలో నేడు అభివృద్ధిలోనూ ముందంజలోనే ఉంది. అదే ఓరుగల్లు. ప్రత్యేక రాష్ట్ర పాలనలో పోరాటాల గడ్డ సాధించిన ప్రగతేంటి..? వరంగల్‌లో జరిగిన అభివృద్ధేంటి..? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్‌.

పోరాటాల గడ్డ ఓరుగల్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా మారింది. చారిత్రకంగా, పర్యాటకంగా వైద్యం, విద్య ఇలా ఏరంగం చూసినా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని హంగులూ కల్పించడంతో ఓరుగల్లు రూపురేఖలే మారిపోయాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి.

జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే తీసుకోవాల్సిన మౌలిక లక్ష్యాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే విద్యా, వైద్యానికి పెద్దపీట వేశారు. వరంగల్ నగరంలో కాళోజీ నారాయణ రావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మెడికల్ హబ్‌గా మార్చాలన్న సంకల్పంతో వరంగల్ సెంట్రల్ జైలును మామునూరుకు తరలించి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు సీఎం. ప్రస్తుతం ఉన్న ఎంజిఎంను మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మలచడంతో పాటు కేఎంసీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలతో పేదవారికి వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పౌష్ఠికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతున్న చిన్నారులు, మహిళలకు ప్రత్యేక మెనూ ప్రవేశపెట్టి అమలు చేస్తోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తోంది ప్రభుత్వం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కొత్త పరిశ్రమలను వరంగల్‌కు తీసుకొస్తోంది. గీసుకొండ వద్ద టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ ఐపాస్ మొదటి దశలోనే హైదాబాద్ టూ వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్‌కు అంకురార్పణ చేసింది. దాదాపు 500 పైచిలుకు యూనిట్లను మంజూరు చేసి వేలకోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళికలకు బీజం వేసింది. ఇక ఔటర్ రింగ్‌రోడ్ వరంగల్ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించబోతోంది. ఇక వీటితో పాటు 40ఏళ్ల క్రితం వేసిన మాస్టర్ ప్లాన్‌ను సంస్కరించి మరో 50 ఏళ్ల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి విడుదల చేసింది ప్రభుత్వం.

రాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో 'గ్రేటర్‌' రూపురేఖలే మారిపోయాయి. వరంగల్ నగరాభివృద్ధికి మూడేళ్ల పాటు రూ.300 కోట్ల చొప్పున కేటాయించి ఇప్పటికే 900 కోట్లను విడుదల చేశారు. 2021-22 బడ్జెట్‌లోనూ ప్రత్యేకంగా 250 కోట్లు కేటాయించి కనీస వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తూనే కేంద్ర పథకాలను నగరానికి తీసుకొచ్చింది ప్రభుత్వం. స్మార్ట్‌సిటీ, హృదయ్‌, అమృత్‌ పథకాలను నగరానికి దక్కించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసింది. ఖిలా వరంగల్‌ కోటలోని కాకతీయుల కళాసంపదకు కొత్త అందాలు తీసుకొస్తున్న ప్రభుత్వం చారిత్రక పాంత్రాల అభివృద్ధిపై దృషిపెట్టడంతో పర్యాటకుల సందడి నెలకొంది. వీటితో పాటు సంగీత సరిగమ పార్క్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రకాళి బండ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story