మార్కెట్లో మండుతున్న కూరగాయల ధరలు!

Arun Chilukuri
Published on: 29 Sept 2020 5:32 PM IST
మార్కెట్లో మండుతున్న కూరగాయల ధరలు!
X

హైదరాబాద్‌ నగరంలో కూరగాయాల ధరలు మండి పోతున్నాయి. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడికి ఇప్పుడు పెరిగిన కూరగాయాల ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. నగరంలోని రైతు బజార్ లో సైతం 50 రూపాయలకి పై గానే ధరలు ఉన్నాయంటూ నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పేరుగుదలను క్యాష్ చేసుకుంటున్న కొంత మంది దళారులు రైతుబజార్‌లో ధరల పట్టీని ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా కూరగాయాలను విక్రయిస్తున్నారంటు వినియోగదారులు మండిపడుతున్నారు.

లాక్ డౌన్ సమయంలో కూడా అందరికి అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య మధ్యతరగతికి చెందిన వినియోగదారులు విలవిలాడిపోతున్నారు. నిన్నమొన్నటి దాక అందరికి అందుబాటులో ఉన్న టమాట ధరలు మరింతగా పెరిగాయి. లాక్‌డౌన్ కాలంలో 15 ఉన్న కిలో టమాట ధర ప్రస్తుతం రైతు బజార్లో కిలో 41 ఉండగా బహిరంగ మార్కెటల్లో 65 నుంచి 70 పలుకుతోంది. రెండు నెలల క్రితం వరకు 20 ఉన్న ఆలూ రైతు బజార్లో 40 ఉండగా బహిరంగ మార్కెట్లో కిలో 60 వరకు పలుకుతోంది. ఇలా ఏది చూసినా బహిరంగ మార్కెట్లో కిలో 40 నుంచి 60కి తక్కువగా ఉండటంతో లేదు. చిక్కుడు రకాలన్నీ సామాన్యుడికి చిక్కె పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విధంగా కూరగాయలన్నీ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

రాష్ట్రంలో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆగస్టు ఆరంభంలో ఉన్న ధరలతో పోలిస్తే చివరి వారానికి వచ్చేసరికి ధరలు రెండింతలు పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరి, పత్తి, వాణిజ్య, ఆరుతడి పంటలతోపాటు కూరగాయల పంటలనూ దెబ్బతీశాయి. ఉత్పత్తితోపాటు దిగుమతులూ తగ్గిపోవటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నగరంలోని రైతు బజార్‌లతో పాటు గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి మార్కెట్లలోనూ ధరలు మండిపోతున్నాయి.

రాష్ట్రంలో ఏడాదికి 46 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం. ఐసీఎంఆర్‌ లెక్కల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 325 గ్రాముల కూరగాయలు తినాలి. కాని 250 గ్రాములే తింటున్నారు. ఇది సగటున 75 గ్రాములు తక్కువ. మొత్తంమీద 36 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలే తింటున్నారు. మన రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతుండగా, మిగతావి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. గత నెలలో అల్పపీడనం కారణంగా ఎడతెరపి లేని వర్షాలు కురవడంతో చేతికి రావాల్సిన పంట అందక పోవడమే ధరల పెరుగుదలకు కారణమని అధికారులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story