పల్లెబాట పట్టిన హైదరాబాద్‌ ప్రజలు: ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Arun Chilukuri
Updated on: 12 Jan 2021 12:15 PM IST
TSRTC to operate special buses for Sankranti
X

హైదరాబాద్‌ ప్రజలు పల్లెబాట పట్టారు. బ్యాగులు సర్దుకుని సొంతూరికి పయనమయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ ఇళ్లకు వెళ్తుడటంతో బస్‌, రైల్వే స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని బట్టి అటు టీఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ఆర్టీసీ ఎమ్‌జీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్స్‌లో అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌తో పాటు మంచిర్యాల, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికుల కోసం జేబీఎస్‌ నుండి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం మైక్‌ల ద్వారా బస్సుల డీటైల్స్ అనౌన్స్‌ చేస్తున్నారు.

అటు ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం ఎంజీబీఎస్‌లో అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక బస్సులను కేటాయించింది. దీంతోపాటు ప్రైవేట్‌ వాహనాలకు చెక్‌పెట్టి ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు వరంగల్‌ వెళ్లే వారి కోసం ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌లో, నల్గొండ, సూర్యాపేట వెళ్లే ప్రయాణికుల కోసం ఎల్బీ నగర్‌ దగ్గర ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కేటాయించింది. అటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 4వేల 981 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది టీఎస్‌ఆర్టీసీ.

ఇక ఇప్పటికే దాదాపు 1100 ప్రత్యేక బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలియజేశారు. ప్రత్యేక బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి 50శాతం అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్ల చేసుకున్నారన్నారు ఆయన. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతీ ప్రయాణికుడు మాస్క్‌ ధరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

అటు పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికుల కోసం 56 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో ఏపీ మీదుగా 29 రైళ్లు వెళ్తున్నాయి. ఒక్కో రైల్లో సుమారు 500 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటంతో వాటికి కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story