మళ్లీ తిరగనున్న వజ్ర ఏసీ బస్సులు.. అయోమయంలో ఆర్టీసీ అధికారులు

TSRTC Starts Vajra AC Buses Again
x

మళ్లీ తిరగనున్న వజ్ర ఏసీ బస్సులు.. అయోమయంలో ఆర్టీసీ అధికారులు

Highlights

Vajra Buses: ఆర్టీసీ అధికారులు చేసిన ఒక చిన్న తప్పుతో సంస్థ మొత్తం రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

Vajra Buses: ఆర్టీసీ అధికారులు చేసిన ఒక చిన్న తప్పుతో సంస్థ మొత్తం రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన వజ్ర బస్సుల వల్ల తీవ్ర నష్టాలు వస్తుండడంతో వాటిని కొంత కాలానికే డిపోలకు పరిమితం చేశారు. తాజాగా కొన్ని బస్సులను వేలానికి ఉంచి మిగిలిన బస్సులను రోడ్డెక్కించాలాని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయంతో అధికారులు ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నారు.

పొట్టి బస్సులుగా పిలిచే వజ్ర బస్సుల పరిస్థితి దారుణంగా తయారైంది. వంద వజ్ర బస్సులు కొన్నప్పటి నుంచి ప్రయాణికుల ఆదరణ చూరగొనలేక ఆర్టీసీని తీవ్ర నష్టాల పాలుచేసింది. దీంతో విసుగొచ్చి వాటిని వదిలించుకునేందుకు గత ఏడాది వేలం వేసి విక్రయించాలని నిర్ణయించారు. అప్పటి ఎండీ సునీల్‌ శర్మ ఆమోదంతో అధికారులు 60 బస్సులను వేలానికి ఉంచారు. మరో 40 బస్సులు 2 లక్షల కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగాయి. ఇవి మంచి కండిషన్‌లో ఉండటంతో వాటిని వేలంలో అమ్మడం సరికాదని తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీసుకున్న నిర్ణయం అధికారుల్ని అయోమయానికి గురి చేస్తోంది. కొన్నప్పటి నుంచి సమస్యలు వేధిస్తుండటం, ఏ రకంగానూ అనుకూలంగా లేని ఈ బస్సుల్ని ఎలా తిప్పాలోనని భావిస్తున్నారు. ఎండీ సజ్జనార్‌ ఆదేశం మేరకు వాటిని తిరిగి నగరంలో వినియోగించాలని నిర్ణయించి కొన్ని డిపోలకు అప్పగించారు.

వజ్ర బస్సుల్లో 18 సీట్లే ఉంటాయి. ఇంత చిన్న బస్సులకు ఓ డ్రైవరు, కండక్టర్‌ ఇలా రెండు షిఫ్టుల్లో నలుగురిని నియమిస్తే వాటితో వచ్చే ఆదాయం కనీసం ఇద్దరి జీతాలకు కూడా సరిపోదు. కేవలం టిమ్‌ యంత్రం ద్వారా డ్రైవరే టికెట్లు ఇచ్చే పద్ధతికే ఇవి సరిపోతాయి. కానీ సిటీలో కండక్టర్‌ లేకుండా డ్రైవర్‌ ఒక్కడితో బస్సు నడపడం సాధ్యం కాదు. దీంతో స్టేజీ క్యారియర్‌గా అది పనికి రాదని తేల్చేశారు. నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు నడపాలని భావించారు. కానీ, ఇంజిన్‌ వరకు ఈ బస్సు కండిషన్‌లో ఉన్నా ఏసీ విషయంలో తయారీనే నాసికరంగా ఉంది. ఏసీ సమస్య కారణంగా తిప్పలేని పరిస్థితి నెలకొంది.

నగరంలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు వజ్ర బస్సులను అద్దెకివ్వాలని పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతినే అవలంబిస్తున్నాయి. ఇక మిగిలిన అవకాశం పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు, యాత్రలకు అద్దెకివ్వటం. దీంతో వాటి బుకింగ్‌ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ఆర్డర్లు కొంత మెరుగ్గానే వస్తున్నాయి. ఇక యాత్రలకు వీలుగా తాత్కాలికంగా ఏసీ సమస్య లేకుండా చేసి అద్దెకిచ్చే యోచనలో ఉన్నారు.

ఆర్టీసీ ఆదాయం పెంపు కోసం గతంలో అధికారులు చేసిన పొరపాట్లు సంస్థకు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. సంస్కరణల్లో భాగంగా ఇన్ని రోజులుగా ఓ మూలాన ఉన్న వజ్ర బస్సులు ఇప్పుడైనా సంస్థకు వజ్రమయ్యేనా వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories