హైదరాబాద్‌ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత

Arun Chilukuri
Published on: 16 Dec 2020 4:25 PM IST
హైదరాబాద్‌ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత
X

హైదరాబాద్‌ పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉప్పుగూడ కాళికామాత ఆలయానికి చెందిన 24, 25, 26 సర్వే నెంబర్లలో 70 కోట్లు విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఓ వ్యక్తి తనదంటూ సిటీ సివిల్‌ కోర్టు నుంచి పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఆర్డర్లు తీసుకోవడంతో పాటు ఆ స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతున్నాడు. దీంతో స్థానికులు బీజేపీ నాయకులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకుని ప్రశ్నించిన బీజేపీ నేతలను, స్థానికులను పోలీసులు వాహనాల్లో తరలించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

1951 సంవత్సరంలో ఈ స్థలాన్ని దేవాదాయశాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి 11 సార్లు వేలం పాట వేస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. ఒకసారి వేలంపాట కూడా నిర్వహించింది. వేలం పాటలో ధర తక్కువ పలకడంతో సీపీఐ నాయకులు దేవాదాయశాఖ ఎదుట ధర్నా నిర్వహించారు. హైకోర్టును కూడా ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటినుంచి రాని వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఆ స్థలాన్ని తనకు ఆలయ ట్రస్టీ అమ్మిందని ఆరోపిస్తున్నాడు. ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహారీ నిర్మిస్తుండగా స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు.

దీంతో తన స్థలంలో చేపడుతున్న నిర్మాణాలను స్థానికులు అడ్డుకుంటున్నారని చెబుతూ సిటీ సివిట్‌ కోర్టు నుంచి పోలీస్‌ ప్రొటెక్షన్‌ కావాలని ఆర్డర్లు తెచ్చుకున్నాడు. దీంతో ఆ స్థలం దగ్గరకు పోలీసులు భారీగా చేరుకొని నిర్మాణాలు జరిగేలా చూస్తున్నారు. బీజేపీ నేతలకు సమాచారమిచ్చిన స్థానికులు వారితో కలిసి నిర్మాణాలను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story