Telangana: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి సాధారణంగా సాగనున్న కార్యకలాపాలు

Telangana Lifts Lockdown Completely From Today
x

Telangana: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి సాధారణంగా సాగనున్న కార్యకలాపాలు

Highlights

Telangana: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కార్యకలాపాలన్నీ సాధారణంగానే సాగనున్నాయి.

Telangana: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కార్యకలాపాలన్నీ సాధారణంగానే సాగనున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. లాక్‌డౌన్‌కు ముందున్న.. అన్ని కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రజలు మాత్రం స్వీయనియంత్రణ మరవద్దని కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలోఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. దీంతో మే 12 నుంచి రాష్ట్రంలో అమలైన లాక్‌డౌన్‌ ముగిసింది.

ఇవాళ్టి నుంచి ఇక కార్యకలాపాలన్నీ సాధారణంగా సాగనున్నాయి. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం అన్‌లాక్ ఉత్తర్వులను జారీ చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న కార్యకలాపాలు అన్నింటినీ అనుమతిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. బహిరంగ, పని ప్రదేశాలతో పాటు ప్రయాణ సమయాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లేదంటే వెయ్యి రూపాయల జరిమానా పడుతుందని సర్కార్ హెచ్చరించింది. దుకాణాలు, కార్యాలయాలు, సంస్థల వద్ద కరోనా నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలని లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దన్న ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామని అంతమాత్రాన కొవిడ్​ విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని కోరింది.

హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న టిమ్స్‌ను ప్రజాఅవసరాలకు అనుగుణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతిచ్చింది. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో కొత్తగా ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేసింది. రైతుబంధు పంపిణీ సాఫీగా సాగుతోందని, ఇప్పటివరకు 5 వేల 145 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కరోనా కష్టకాలంలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది.

హైదరాబాద్ కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్‌గా మార్చాలని నిర్ణయించింది. ధరణి అమలు తీరుపై మంత్రివర్గంలో సమీక్ష జరిగింది. ప్రత్యేకించి రైతుల సమస్యలు, వాటి పరిష్కారం తీరుతెన్నులపై చర్చించారు. దాదాపు 90 వేల ఫిర్యాదులకు గాను 70వేలకు పైగా పరిష్కారం అయ్యాయని అధికారులు చెప్పినట్లు సమాచారం. పల్లె, పట్టణప్రగతి పనుల పురోగతి, ఆకస్మిక తనిఖీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పల్లెప్రగతి, పట్టణప్రగతిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories